అట్టుంటాది బాబుతోనీ.. పాపం పిఠాపురం వర్మ..!

గత కొన్ని రోజులుగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో కూటమి రాజకీయం కాకరేపుతోన్న సంగతి తెలిసిందే.

“తనకు అవమానం జరుగుతుంది.. పవన్ గెలుపులో తన కష్టం ఉందన్న విషయం జనసైనికులు మరిచిపోతున్నారు.. నాడు తాను అడ్డం తిరిగి ఉంటే గాజువాక, భీమవరం సీన్ రిపీట్ అయ్యి ఉండేది” అన్నట్లుగా టీడీపీ నేత వర్మ మాట్లాడటం లేదు. ఆయన ఆవేదనల్లా… “పిఠాపురంలో చంద్రబాబుని కావాలనే అవమానిస్తున్నారు.. ఫ్లెక్సీల్లో సీఎం ఫోటో పెట్టాలనే ప్రోటోకాల్ ని పాటించడం లేదు” అని!

దీనిపై ఇప్పటికే ఓ సారి పెద్ద రాద్ధాంతమే జరగ్గా.. తాజాగా అది తోపులాటలు, కొట్టుకోవడాలవరకూ వెళ్లిన పరిస్థితి. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన పెండెం దొరబాబు వర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నట్లుగా వ్యవహారం సాగింది! ఈ సమయంలో… వాడూ, వీడు, అవినీతి పరుడు, అతని అవినీతిపై విచారణ చేసి తీరతాను అంటూ దొరబాబుపై వర్మ నిప్పులు చెరిగారు!

ఈ విషయంలో… చంద్ర‌బాబు ఫొటో లేకుండా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ఏంటంటూ నిల‌దీసిన వర్మ్… ఇలా వ‌రుస‌గా చంద్ర‌బాబును కించ‌ప‌రిచేలా జ‌న‌సేన నేత‌లు చేస్తుంటూ ఊరుకునే ప్ర‌శ్నే లేద‌ని హెచ్చ‌రించారు. పిఠాపురంలో టీడీపీ బలంగా ఉంది కనుకే పవన్‌ కు 70 వేల మెజార్టీ ఇచ్చామని.. టీడీపీ బలహీనంగా లేదని.. ఇకపై తామేంటో చూపిస్తా అని వర్మ హెచ్చరించారు. మరోవైపు వర్మపై దొరబాబూ ఒకటికి నాలుగు మాటలన్న పరిస్థితి!

కట్ చేస్తే… వ్యవహారం మిగిలిన ప్రాంతాల్లోని జనసైనికులకూ చేరడంతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబుకూ చేరిందని తెలుస్తోంది. ఈ సమయంలో ఓ బిగ్ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

తాజాగా పిఠాపురంలోని వ్యవహారంపై జనసేన కీలక నాయకురాలు ముద్రగడ క్రాంతి స్పందించారు. ఈ సందర్భంగా… అసలు మీ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావడం లేదు వర్మ.. అని మొదలుపెట్టిన క్రాంతి… పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం దగ్గర నుంచి మీ వైఖరి వింతగానే ఉందని.. ఏదో రకంగా రచ్చ చేయడమే మీ పనిగా కన్పిస్తోందని ధ్వజమెత్తారు. ఫొటోల గురించి రగడ సృష్టించడం ఏమిటి? అని ప్రశ్నించారు.

చీటికీ మాటికీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసేలా వర్మ ప్రవర్తన ఉందంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత, ఎన్డీయేలో భాగస్వామి అనే విషయం మరిచిపోయారా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో… జనసేన అధినేత ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే ఇలా వ్యవహరిస్తే ఏమని అర్థం చేసుకోవాలని క్రాంతి నిలదీశారు.

మరో అడుగు ముందుకేసి… కూటమిలో చిచ్చు పెట్టేలా వర్మ వ్యవహారం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయంటూ ఆమె ఆరోపించారు.

ఆ సంగతి అలా ఉంటే… ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారడం… “నివురుగప్పిన నిప్పుకు పిఠాపురంలో పొగలు” అనే కథనాలు వెలువడటం… మరోవైపు తాజాగా కోనసీమలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలోని ఫ్లెక్సీలో పవన్ ఫోటో లేకుండా చేయడం వంటి ఘటనలు తెరపైకి రావడంతో… మేటర్ చంద్రబాబు వరకూ వెళ్లిందని అంటున్నారు. దీనిపై ఆయన సీరియస్ గా స్పందించారని.. వర్మ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు.

అవును… చంద్రబాబుకు పిఠాపురంలో అవమానం జరుగుతుందని, ఈ ప్రాంతంలో టీడీపీని అణిచివేసి, దీన్ని జనసేన కంచుకోటగా మార్చాలని భావిస్తున్నారని, సీఎం విషయంలోనే ప్రోటోకాల్ పాటించడం లేదని, చంద్రబాబుకు అవమానం జరిగితే తాను సహించేది లేదని, ఆయనకోసం ఎంతవరకైనా వెళ్తానని అన్నట్లుగా ఓ పక్క వర్మ స్పందిస్తుంటే… మరోపక్క చంద్రబాబు మాత్రం… వర్మ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఇదే సమయంలో… ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడిన చంద్రబాబు, పార్టీ అంతర్గత క్రమశిక్షణపై కఠినంగా వ్యవహరించాలని సూచించిన పరిస్థితి.

ఈ సందర్భంగా స్పందించిన బాబు… కూటమి ప్రభుత్వంలో నేతలంతా ఒకే తాటిపై ఉండాలని, చిన్న చిన్న ప్రోటోకాల్ విషయాల కోసం వీధి గొడవలకు దిగడం పార్టీ గౌరవాన్ని తగ్గిస్తుందని, సీనియర్ నేతగా ఉన్న వర్మ ఇలాంటి వివాదాలకు కారణం కావడం సరికాదని, ఏదైనా పొరపాటు జరిగితే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప, ఘర్షణలకు దిగడం తగదని క్లాస్ పీకారని అంటున్నారు.

దీంతో… చంద్రబాబు కోసం మాట్లాడితే, అందుకు జనసేన నేతలు వర్మపై దాడి చేస్తే.. తిరిగి అదే చంద్రబాబు, వర్మకు క్లాస్‌ పీకడంపై ఏమిటంటూ ఆయన అనుచరులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

పిఠాపురంలో జనసేన నేతలను కంట్రోల్ చేయమని, క్రమశిక్షణ పాటించమని, కూటమిలో లుకలుకలనే సందేశాన్ని జనాల్లోకి వెళ్లకుండా చూడాలని పవన్ కల్యాణ్ కు చెప్పాల్సింది పోయి… తన మాటకు లోబడి పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!

ఈ నేపథ్యంలోనే… “కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?” అనే ప్రసిద్ధ తెలుగు సామెతను గుర్తుకు తెచ్చుకుంటున్నారు నెటిజన్లు. చంద్రబాబుకే నొప్పి లేనప్పుడు… వర్మకు ఈ ఆందోళన, ఆయాసం, ఆవేశం ఎందుకని అంటూ.. ప్రస్తుతం కూటమి రాజకీయంలో ఆయన ఆటలో అరటిపండులా మారబోతున్నారా అనే చర్చను తెరపైకి తెస్తోన్నారు!