వైఎస్ వివేకా డెత్ మిస్టరీ.! సునీతా రెడ్డి తప్పటడుగు.!

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి డెత్ మిస్టరీ ఎప్పటికి వీడుతుంది.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్. జూన్ నెలాఖరులోపు విచారణ పూర్తి చేసి, చార్జిషీటు దాఖలు చేయాలని గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. నిజానికి, ఈ డెడ్‌లైన్ గతంలో ఏప్రిల్‌లో వుండేది.. ఇప్పుడది జూన్ నెలాఖరు నాటికి మారింది.

ముందు ముందు మళ్ళీ మారుతుంది కూడా. కేసులో దోషులెవరు.? అన్నదానికన్నా, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయాలన్న దిశగా రాజకీయ రచ్చ ఎక్కువగా జరుగుతోంది. ఆ రచ్చలో స్వాయానా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఇరుక్కుపోతున్నారు.

తాజాగా, సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌ని రద్దు చేయాలని కోరుతూ. నిజానికి, ఆ పని చేయాల్సింది సీబీఐ. అయితే, సీబీఐ ఈ విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది.

ఏ8 నిందితుడిగా అవినాశ్ రెడ్డిని పేర్కొన్న సీబీఐ, ఇప్పటిదాకా ఏం వివరాలు అతన్నుంచి రాబట్టింది.? అన్నది మళ్ళీ పెద్ద ప్రశ్న. సుప్రీంకోర్టులో తాజాగా సునీతా రెడ్డి స్వయంగా వాదనలు వినిపించడం చర్చనీయాంశమయ్యింది. ‘ఆయన్ని అరెస్టు చేయించాలన్న తొందర మీలో కనిపిస్తోంది..’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారట.

ఇంతకన్నా తప్పటడుగు ఇంకేముంటుంది.? వృత్తి రీత్యా సునీతా రెడ్డి ప్రముఖ వైద్యురాలు. కేసులో దోషులెవరో తేలడం ముఖ్యమని ఆమెకి తెలియదా.? ఆమె ఎందుకు స్వయంగా వాదనలకు దిగాలి.? తప్పటడుగే.. మామూలు తప్పటడుగు కాదిది.!