నానాటికీ దిగజారుతున్న లోకేష్ పాదయాత్ర.!

సొంత జిల్లాలోనే పాదయాత్ర ఇంత పేలవంగా సాగితే.. ముందు ముందు పరిస్థితేంటి.? మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి ఆవేదన ఇది. నిజానికి.. పేరుకే సొంత జిల్లా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి అంతగా వెలుగులేమీ లేవు. 2019 ఎన్నికల్లో దారుణమైన దెబ్బ తగిలింది రాజకీయంగా చంద్రబాబుకీ, తెలుగుదేశం పార్టీకీ.

ఆ చిత్తూరు జిల్లా కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. ‘యువగళం’ పేరుతో ప్రారంభమైన పాదయాత్ర నానాటికీ దిగజారుతూ వస్తోంది. ఈ విషయం పార్టీ క్యాడర్‌కే అర్థమయ్యింది. జనాన్ని సమీకరించలేక స్థానిక నాయకత్వం నానా తంటాలూ పడుతోంది.

పెద్దయెత్తున కార్యకర్తల్ని రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి టీడీపీ తరలిస్తోంది. ఈ క్రమంలో నాయకులకు ఖర్చు తడిసి మోపెడైపోతోంది. యువ నేత పాదయాత్ర అంటే ఎలా వుండాలి.? యువత.. కనిపించాలి. ఆ యువత స్థానంలో కేవలం కార్యకర్తలే కనిపిస్తున్నారు. ఆ కార్యకర్తల అత్యుత్సాహం టీడీపీ కొంప ముంచుతోంది.

పాదయాత్ర ప్రారంభించిన రోజే నందమూరి తారక రత్న ఆసుపత్రి పాలవడం.. మృత్యువుతో పోరాడుతుండడం.. వెరసి, నందమూరి అభిమానుల్లో లోకేష్ పాదయాత్ర మీద మేగ్జిమమ్ నెగెటివిటీ వచ్చేసింది.. అదే కొనసాగుతోంది కూడా.

పరిస్థితి అస్సలేం బాగాలేదంటూ యువగళం పాదయాత్రపై చంద్రబాబు కూడా గుస్సా అవుతున్నారు. పాదయాత్రకు ప్రత్యేక అతిథుల్ని తెప్పించి, హంగామా క్రియేట్ చేయాలంటూ చంద్రబాబుకి కొందరు టీడీపీ నేతలు సూచిస్తున్నారట. కానీ, ఎవర్ని రప్పించాలి.? తారకరత్న కోసం బెంగళూరులోనే బాలయ్య ఆసుపత్రి వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తోంది. జూనియర్ ఎన్టీయార్ రాడు. కళ్యాణ్ రామ్ సంగతి సరే సరి.! ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదంతే.