జనసేన అభిప్రాయం కూడా సోమే చెప్పేస్తున్నారుగా!

ప్రసుతం తిరుపతి పర్యటనలో ఉన్న సోము వీర్రాజు.. అటు అధికారపార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలపై విమర్శల దాడి పెంచుతున్నారు. వైసీపీ – టీడీపీ… రెండూ దొందూ దొందే అని కామెంట్ చేస్తున్నారు! ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లో జనసేన – బీజేపీ పొత్తుపై స్పందించారు సోము!

ఏపీలో బీజేపీ – జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయా? అంటే… ఉంటే ఉన్నట్లు.. లేకపోతే లేనట్లు అనే సామాధానం వస్తుంటుంది. ఎందుకంటే… పవన్ హస్తిన వెళ్లినప్పుడు మాత్రమే.. ఆ రెండు పార్టీలూ పొత్తులో ఉన్నాయన్న విషయం జనసేన నుంచి వినిపిస్తుంది. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ బీజేపీ నేతలే చెప్పుకుంటుంటారు.

ఆ సంగతులు అలా ఉంటే.. తాజాగా ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఒకపక్క అధికారపార్టీ ఏకగ్రీవాలపై దృష్టిపెట్టి దూసుకుపోతుంటే.. మరోపక్క ప్రతిపక్షం టీడీపీ అచేతనంగా ఉండి.. కిందా మీదా పడుతున్న పరిస్థితి! ఈ సమయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ రెడ్డికి బీఫార్మ్ ఇచ్చింది బీజేపీ!

ఈ సందర్భంగా మైకందుకున్న సోము.. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు జనసేన మద్దతు ఉందని చెప్పుకొచ్చారు. మరి ఇదే టైపు మైత్రి బందమో.. ఇది ఏ రకం పొత్తు బందమో తెలియడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే… ఇప్పటివరకూ ఎమ్మెల్సీ ఎన్నికలు, వాటిలో తమ మద్దతు గురించి ఇప్పటివరకూ జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు!

కానీ… సోము వీర్రాజు మాత్రం జనసేన స్టేట్ మెంట్స్ కూడా తానే ఇస్తూ.. వారి దృష్టిలో జనసేన స్థానాన్ని, స్థాయినీ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు! మరి ఈ మద్దతు వ్యవహారంపై పవన్ స్పందిస్తారా.. లేక, తనను ఎవరు ఎలా వాడుకుంటే అలా వాడుకోనివ్వండటూ బిజీగా ఉంటారా అన్నది వేచి చూడాలి!