జగన్, పవన్ కు ఆ ధైర్యం లేదు : మంత్రి సోమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారు. రాజకీయ పరమైన భాషలో కాకుండా తిట్ల భాషలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైసిపి బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ మీద అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అందులో భాగంగానే సోమిరెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. పనిలో పనిగా జనసేన అధినేత పవన్ మీద కూడా సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ మీద ఘాటుగా పవన్ మీద సరళంగా మాట్లాడారు సోమిరెడ్డి. ఆయన కామెంట్స్ ఒకసారి చదవండి.
మతి లేని నాయకుడు జగన్..గతి తప్పిన పార్టీ వైకాపా. ఢిల్లీలో పోరాడాల్సిన ఎంపీలు రాజీనామా చేసి ఇళ్లలో కూర్చున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన వాళ్లు ఆ వేదికను వదిలిపెట్టి రోడ్లపై తిరుగుతున్నారు. ప్రజాప్రతినిధులు అనే పదానికి అర్ధం లేకుండా చేశారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. జగన్ అనాలోచిత నిర్ణయాలు, నియంతృత్వ విధానాలతో ప్రజల్లో వైకాపా చులకనైంది. వైకాపా నేతల్లోనూ అసంతృప్తి, అంతర్మథనం మొదలైంది. జగన్ లక్ష్యం ఒక్కటే. సీఎం కుర్చీ కావాలి. మోదీతో లాలూచీ పడాలి. కేసుల నుంచి బయటపడాలి. టీడీపీ ఢిల్లీలో పోరాడుతుంటే జగన్ రోడ్లపై తిరుగుతున్నారు. జీతాలు తీసుకోండి కానీ, చట్టసభలకు వెళ్లొద్దని వైకాపా ప్రజాప్రతినిధులకు జగన్ చెబుతున్నారు. ఢిల్లీలో పోరాడే దమ్ములేక పదేపదే బంద్ లకు పిలుస్తుంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి. బంద్ వల్ల రాష్ట్రానికే నష్టం. వస్తు సేవల పన్ను ఒక్క రోజు ఆదాయానికి రూ.190 కోట్ల నష్టం వాటిల్లింది. ఆర్టీసీకి రూ.8 కోట్ల నష్టం వచ్చింది. జగన్ కు ఆలోచించే శక్తి లేకుండా పోయింది. టీడీపీ ఎంపీలను రాజీనామా చేయమంటాడు. ఒక సాధారణ పౌరుడికి ఉండే ఆలోచన కూడా జగన్ కు లేకపోవడం దురదృష్టకరం. వాజ్ పేయి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు ప్రతిపక్ష నేతలుగా ఎన్నడూ అధికారాన్ని కోరుకోలేదు. దశాబ్దాల పాటు అధికార పార్టీల పొరపాట్లను సరిదిద్దుకునేలా చేస్తూ ప్రజలకు అండగా నిలిచారు. సీఎం కుర్చీలో వేరే వాళ్లు కూర్చుంటే చూడలేక రెండున్నరేళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా ఉండే జగన్ లాంటి వారిని ఎక్కడా చూడలేదు. తండ్రి అధికారంలో ఉంటే కుమారులు ఏమైనా చేయవచ్చని వీరవిహారం చేసి భారీ అవినీతికి పాల్పడి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. పారిశ్రామికవేత్తలను జైళ్లకి పంపి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం తేవడం దారుణం. జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ ఢిల్లీకి వెళ్లి పోరాడే దమ్ము లేదు. జనసేన అధినేత సినిమాల్లో మంచి హీరోనే. రాజకీయాల్లోనే ఆయన తీరు అంతుబట్టడం లేదు.