Kakani Govardhan Reddy: ఏపీలో తాజాగా రెండు కీలక కేసులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఓ వైపు మద్యం అక్రమాల కేసు, మరోవైపు గనుల దోపిడి ఆరోపణలతో సంబంధం ఉన్న ఇద్దరు వైసీపీ కీలక నేతలు పోలీసులకు చిక్కకుండా ఉన్నారు. మద్యం స్కాం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, గనుల అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలు అజ్ఞాతంలో కలిసిపోయారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినా ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదు.
కసిరెడ్డి కేసులో ఇప్పటికే మూడు సార్లు నోటీసులు పంపిన సిట్ అధికారులు, అతని ఇంట్లో సోదాలు చేసినా స్పందన రాలేదు. కోర్టు విచారణకు హాజరుకావాలని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన బయటకే రాలేదు. ఈ వ్యవహారంపై విచారణకు సైతం ఆయన సహకరించలేదు. ప్రభుత్వమే ప్రత్యేకంగా నియమించిన సిట్ బృందం అతన్ని పట్టుకోలేకపోవడం విచిత్రంగా మారింది. ఇదే కేసులో విచారణకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… “అంతా కసిరెడ్డే!” అంటూ స్పష్టమైన ప్రకటన ఇవ్వడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది.
ఇక గనుల కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారన్నదే పెద్ద ప్రశ్న. రూ.250 కోట్ల అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా లేకుండానే కాకాణి కనిపించకుండా పోవడంపై పోలీసుల నిష్క్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, నెల్లూరులో చేక్చేసినా తుదితీర్పు లేదు.
ఈ క్రమంలోనే ఆయనను పట్టిస్తే రూ.25,000 బహుమతి ఇస్తానని సోమిరెడ్డి ప్రకటించారు. అధికార వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందా? లేక వాళ్ళు నిజంగానే పరారీలో మ్యాజిక్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇకనైనా ఈ ఇద్దరిపై దృష్టి పెట్టి రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ వివాదాలకు ముగింపు పలకాలని ప్రత్యర్ధులు కోరుకుంటున్నారు.