తీరిక లేనంత బిజీగా వున్నావా తారక రామా.!

తాతయ్య పేరు పెట్టుకుంటే సరిపోదు.. ఆయన గౌరవాన్నీ కాపాడాలి కదా.! ఆయనకి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా, పాల్గొనేందుకు మేగ్జిమమ్ ప్రయత్నించాలి కదా.? కొన్నాళ్ళ క్రితం, హైద్రాబాద్‌లో స్వర్గీయ ఎన్టీయార్ శతజయంతి వేడుకల కార్యక్రమం జరిగింది. అది కూడా, జూనియర్ ఎన్టీయార్ పుట్టినరోజు సమయంలో.

దానికి, జూనియర్ ఎన్టీయార్ ‘కన్వీనియెంట్‌గా డుమ్మా కొట్టేశాడు’.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ముందస్తు కార్యక్రమాల నేపథ్యంలో.. అంటూ ఓ వివరణ పడేశారు, జూనియర్ ఎన్టీయార్ తరఫున. సరే, తాత మీద మనవడికి గౌరవం లేకపోవడం అనేది జరిగే పనేనా.? ఛాన్సే లేదు.

ఇప్పుడు ఏకంగా, స్వర్గీయ ఎన్టీయార్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదలైతే, అదీ రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగితే, స్వర్గీయ ఎన్టీయార్ మనవడిగా జూనియర్ ఎన్టీయార్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. చిత్రంగా కళ్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళలేదు.

సినిమా షూటింగుల్లో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్ బిజీగా వున్నారన్నది ఓ కుంటి సాకు మాత్రమే.! పోనీ, చంద్రబాబుతోనో, బాలకృష్ణతోనో వేదిక పంచుకోవడం ఇష్టం లేదా.? అంటే, మొన్నీమధ్యనే కదా, హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట, ఆమె కొడుకు పెళ్ఫి జరిగితే, జూనియర్ ఎన్టీయార్ అలాగే కళ్యాణ్ రామ్ వెళ్ళారు.? ఆ కార్యక్రమంలో బాలయ్య, చంద్రబాబు కూడా పాల్గొన్నారు కదా.?

ఎక్కడో తేడా జరిగింది.! బీజేపీతో ఎన్టీయార్‌కి సన్నిహిత సంబంధాలే వున్నాయి. సో, వెళ్ళకపోవడానికి బలమైన కారణాలైతే లేవు. మరెందుకు డుమ్మా కొట్టినట్లు.? ఇదొక అద్భుత అవకాశం. రాష్ట్రపతితో ఎన్టీయార్ కుటుంబం గ్రూప్ ఫొటో.. అరుదైన ఘట్టం.! అదీ, స్వర్గీయ ఎన్టీయార్ పేరుతో నాణెం విడుదల కార్యక్రమం. సరిదిద్దుకోలేని తప్పు చేశావ్ బుడ్డోడా.!