రఘవీరారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన బైరెడ్డి

ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన బైరెడ్డి రెండ్రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫండ్‌ను రఘువీర కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కి రఘువీరా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాగుందంటూ తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని విమర్శించారు. ఏపీలో రఘువీర ఒక నియంతలా వ్యవహరిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. రఘువీరా గురించి తాను నిజాలు చెబితే తనను పార్టీ నుంచి బహిష్కరించడమేంటని నిలదీశారు. ఏపీలో కాంగ్రెస్‌ను జీరోని చేస్తున్న రఘువీరాను పార్టీ నుంచి బయటకు పంపించాలని బైరెడ్డి వ్యాఖ్యానించారు.