స్పీకర్ తమ్మినేనితో టీడీపీ ఎమ్మెల్యే గంటా భేటీ.. ఏం జరుగుతోందబ్బా.!

Speaker Tammineni

Speaker Tammineni

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏకాంత చర్చలు జరిపారట. అలాగని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. స్పీకర్ హోదాలో వున్న వ్యక్తిని, ఎమ్మెల్యే హోదాలో వున్న వ్యక్తి కలిస్తే, దాన్ని ఇంతలా వెటకారం చేయాల్సిన పనేముంది.? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ ఉక్కు విషయమై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుతో భేటీ అయి, విశాఖకు వచ్చి మద్దతు పలకాల్సిందిగా విజ్ఞప్తి కూడా చేశారు గంటా శ్రీనివాసరావు. సరే, విశాఖ జిల్లాలో తన ప్రాభవం తగ్గేసరికి గంటా శ్రీనివాసరావు వేరే దారి లేక వైసీపీ వైపు చూస్తున్నారనీ, టీడీపీ ఆయన్ని దూరం పెట్టిందనీ వినిపిస్తున్న వార్తల్ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం.

అది వేరే చర్చ. ఇప్పుడు తన రాజీనామాని ఆమోదించమని గంటా శ్రీనివాసరావు, స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు. అమరావతికి వెళ్ళాక తాను ఆ విషయమై పరిశీలన చేస్తానని తమ్మినేని సీతారాం, గంటా శ్రీనివాసరావుకి హామీ ఇచ్చారు. గంటా రాజీనామా గనుక ఆమోదం పొందితే, రాష్ట్ర రాజకీయాల్లో అదో పెను సంచలనమే అవుతుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీనామా ఆమోదం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. గంటా రాజీనామాని ఆమోదిస్తే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైనా వేటు వేయాల్సి వస్తుంది. అలా వేటు వేయించుకోవడానికి వైసీపీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. గంటా అత్యంత వ్యూహాత్మకంగానే ఈ రాజీనామా చేశారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, ఎమ్మెల్యే చేసిన రాజీనామా విషయమై తుది నిర్ణయం స్పీకర్ విచక్షణాధికారాల మీదనే ఆధారపడి వుంటుంది.