అంబటి రాంబాబు ఆడియో లీక్ వెనుక కుట్ర ఎవరిది.?

వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుదిగా చెప్పబడుతున్న ఓ వాయిస్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఓ మహిళకీ, అంబటి రాంబాబుకి మధ్య జరిగిన సంభాషణగా దీన్ని పేర్కొంటున్నారు. అంబటి రాంబాబుకి చెందిన ఫోన్ నెంబర్‌తోనే ఈ ఆడియో కాల్ వుందట. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది గత కొద్ది రోజులుగా. ఈ వ్యవహారంపై ఇప్పటికే అంబటి వివరణ ఇచ్చారు. గతంలోనూ తనపై ఇలాంటి కుట్రలు జరిగాయనీ, ఇప్పుడూ అలాంటి కుట్రే జరుగుతోందనీ, ఈ కుట్రపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాననీ అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఇంతకీ, అంబటి రాంబాబు మీద కుట్ర పన్నుతున్నదెవరు.? అంబటి రాంబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మొదటి దఫాలోనే ఆయనకు మంత్రి పదవి వచ్చి వుండాలి. కొన్ని రాజకీయ సమీకరణాలు, ఇంకొన్ని రాజకీయ కుట్రల కారణంగా ఆయనకు పదవి దక్కలేదన్న ప్రచారం వుంది.

ఈసారి అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఖాయం.. అంటూ వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్న వేళ, ఈ ఆడియో టేపు, దానికి తోడు వీడియో టేపు బయటకు రావడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, జనసేన పార్టీ మద్దతుదారులే కాదు, బీజేపీ మద్దతుదారులు కూడా సోషల్ మీడియాలో ఈ ఆడియో టేపు, వీడియో టేపుల్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. చిత్రమేంటంటే, కొందరు వైసీపీ మద్దతుదారులు కూడా వీటిని ప్రచారం చేస్తుండడం. గతంలో వైసీపీకే చెందిన సినీ నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ కూడా ఓ ఆడియో టేపు వివాదంలో ఇరుక్కున్నారు. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్‌లో కీలక బాధ్యతలు అప్పట్లో ఆయన నిర్వహించేవారు. ఆ వివాదం కారణంగా ఆయన పదవి పోయింది. ఎవరో తన మీద కుట్ర పన్నారంటూ అప్పట్లో పృధ్వీ వాపోయారు. మరి, అంబటి విషయంలో జరిగిందేంటి.? కుట్రలో నిజాలు నిగ్గు తేలతాయంటున్న అంబటి, ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు.? విచారణలో ఏం తేలుతుంది.? వేచి చూడాల్సిందే.