కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి రాజీనామా కలకలం

తెలంగాణ కాంగ్రెస్ లో అసెంబ్లీ సీట్ల వ్యవహారం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. తమ అనుచరులకు టికెట్ రాకపోతే తాము ఎన్నికల్లో పోటి చేయబోమంటూ నేతలు ప్రకటనలు చేస్తూ కొత్త వివాదాన్ని రాజేస్తున్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అలక బూనినట్టు శుక్రవారం మధ్యాహ్నం ప్రచారమైంది. పార్టీలో చేరినప్పడు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం  బయటకు పొక్కింది. తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోతే తాను కూడా తప్పుకుంటానని అధిష్టానానికి ఘాటు హెచ్చరికలు పంపినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే తన అనుచరులకు టికెట్లు, కీలక పదవులు అనే ఒప్పందంతో పార్టీలో చేరారని ఇప్పుడది అమలు  కాకపోవడంతో ఆయన నిరాశకు గురైనట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. తాను తప్పుకుంటానని బరిలో ఉండనని రేవంత్ అన్నారని ప్రచారం కావడంతో అంతా షాకయ్యారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామ ా చేయాల్సిన అవసరమేముందన్న చర్చ జరిగింది. క్షణాల్లో అందరికి తెలియడంతో అంతా ఖంగుతిన్నారు.

కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా తమ అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు సీటు రాకపోతే తాము పోటి చేయమని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ కూడా రాజీనామా చేస్తారని వార్తలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. 

రాజీనామా ప్రచారం పై రేవంత్ ఏమన్నారంటే…

అయితే రేవంత్ తప్పుకుంటున్నారని వస్తున్న వార్తలపై  ఆయన స్పందించారు. తాను నిన్నటి నుంచి ఇంట్లోనే ఉన్నానని తన పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నిన్న, మొన్న ఆస్తుల పై చేశారు, ఇప్పుడు తన పోటి విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. తాను ఏ ఒక్క రిపోర్టర్ తో అలా మాట్లాడలేదని అటువంటి వార్తలన్నీ అవాస్తవమన్నారు. తాను కాంగ్రెస్ నుంచే పోటి చేస్తానన్నారు. ఏమైనా ఉంటే పెద్దలతో మాట్లాడి చర్చించుకుంటాం తప్ప తప్పుడు నిర్ణయాలు తీసుకోమన్నారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ ప్రకటించారు.  

తాను స్క్రీనింగ్ కమిటిలో కూడా ఎటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయలేదన్నారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. కొంతమంది ప్రత్యర్ధులు నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక ఇటువంటి అబద్దపు మాటలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటానని రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో, దేశంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి తాను కృషి చేస్తానని రేవంత్ ప్రకటించారు. 

 రేవంత్ రెడ్డి తన అనుచరులకు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సీట్లివ్వే…

 

     1.వరంగల్ వెస్ట్ (నరేందర్ రెడ్డి)

  1. నిజామాబాద్ రూరల్ (అరికెల నర్సారెడ్డి)

  2. ఆర్మూరు (రాజారామ్ యాదవ్)

  3. ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి)

  4. దేవరకొండ (బిల్యా నాయక్)

  5. ఇల్లందు (హరిప్రియ)

  6. సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి)

  7. చెన్నూరు (బోడ జనార్దన్)

  8.  సీతక్క  (ములుగు)