పసుపు-కుంకుమ తీసుకుని ఉప్పు కారం రాశారా ?

అవుననే అంటున్నారు వైసిపి ఎంఎల్ఏ రోజా. నగిరిలో వైసిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ హోదాలో రెండోసారి గెలిచిన రోజా మీడియాతో మాట్లాడుతూ మహిళలు చంద్రబాబునాయుడు ఇచ్చిన పసుపు-కుంకుమ తీసుకుని తెలుగుదేశంపార్టీకి ఉప్పు కారం రాశారని ఎద్దేవా చేశారు. మహిళలంతా మూకుమ్మడిగా టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేశారంటేనే ఎంతగా వ్యతిరేకత ఉందో అర్ధమైపోతోందన్నారు.

ఎన్నికలకు ముందుగా పసుపు-కుంకుమ అని, ఫించన్లు అని మాయమాటలు చెప్పి జనాలను మోసం చేద్దామని అనుకుంటే సాధ్యం కాలేదన్నారు. జనాలు చాలా తెలివైన వాళ్ళని అంటూనే చంద్రబాబు ఇచ్చేది తీసుకుని తాము చేయాల్సింది చేసినట్లు రోజా అభిప్రాయపడ్డారు.

తనది ఐరన్ లెగ్ అంటూ ప్రచారం చేసిన వెధవలకు రెండోసారి తన గెలుపే సరైన సమాధానంగా మండిపడ్దారు. రోజాది ఐరన్ లెగ్ అంటూ టిడిపి నేతల్లో చాలామంది చాలా సందర్భాల్లో ఎగతాళి చేసిన విషయం అందరూ చూసిందే. దానికి జవాబుగా అన్నట్లుగా ఎన్నికైనట్లు డిక్లేర్ చేయగానే టిడిపి నేతలపై ఎవరి పేరు ప్రస్తావించకుండానే రెచ్చిపోయి వార్నింగులు ఇవ్వటం గమనార్హం.