జగన్ ఏ ముహూర్తాన్న ‘మావిగన్’ టాపిక్ తెరపైకి తెచ్చారో.. పైగా అది సీఆర్డీయే పరిధిలోనే ఉందని చంద్రబాబు ఏ క్షణాన్న దానికి పరోక్షంగా మద్దతు పలికారో.. దీనికితోడు అటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఇటు బాపట్ల వరకూ పార్టీలకు అతీతంగా ‘నాయకులు ఆఫ్ ది రికార్డ్, ప్రజలు ఆన్ ది రికార్డ్’ మావిగన్ కు మద్దతు పలకడం మొదలుపెట్టారని అంటున్నారో కానీ… అప్పటి నుంచి టీడీపీ తీవ్రమైన ప్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయినట్లుందని తాజా పరిణామాలను గమనిస్తే అర్ధమవుతుందని అంటున్నారు పరిశీలకులు.
అమరావతికి చట్టబద్ధత తెచ్చిన ఆనందం కూటమి ప్రభుత్వానికి క్షణం కూడా లేకుండా.. దాని తాలూకు సంబరాలు ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా.. జగన్ “మావిగన్” అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ఆ క్షణం నుంచి మొదలు.. అసలు ‘అమరావతే ఎందుకు ముద్దు – జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ ఎందుకు వద్దు’ అనే విషయంపై స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు టీడీపీ నేతలు. దీంతో.. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలుపెట్టారు. ఆ ‘పవరూ’ సరిపోవడం లేదనో ఏమో కానీ.. ఇప్పుడు ఏకంగా గోడలపైకి ఎక్కి మరీ ట్రోల్స్ మొదలుపెట్టారు.
వివరాళ్లోకి వెళ్తే… వైఎస్సార్ మరణానంతర పరిణామలతో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. వివిధ సందర్భాల్లో అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలుగా ఉన్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావులు పలు మీడియా సమావేశాల్లో జగన్ తీరుపై విరుచుకుపడేవారు.
నాడు వీటికి సంబంధించిన వార్తలు వివిధ పత్రికల్లో అప్పట్లో పెద్ద పెద్ద హెడ్డింగులతోనే పబ్లిష్ అయ్యాయి. తాజాగా అలా పబ్లిష్ అయిన పేపర్ కటింగులను ఒక ఫ్లెక్సీలా సిద్ధం చేసి గోడలపై అంటించారు టీడీపీ నేతలు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… రాష్ట్రంలోని మెజారిటీ రాజకీయ నాయకుల రాజకీయ జీవితాన్ని ఒకసారి గమనిస్గ్తే… వారంతా వారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వంతపాడుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడినవారే. పార్టీ మార్పుల తదనంతరం చెట్టాపట్టాలేసుకుని తిరిగినవారే!
అందుకు నాడు చంద్రబాబు నుంచి మొదలుపెడితే.. ఒక పార్టీకి అధినేత అయిన పవన్ కల్యాణ్ వరకూ దాదాపు అన్నీ ఒకతానులో ముక్కలే! కాకపోతే అంతా గురివింద గింజ బ్యాచ్ అనుకోవాల్సి వస్తుంది.
ఉదాహరణకు… ఇందిరాగాంధీ అనుమతిస్తే, ఆదేశిస్తే.. ఎన్టీఆర్ పై పోటీ చేస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికిన సంగతి ప్రజలు మరిచిపోలేదు కదా..? ఇప్పుడు.. ఆయన ప్రతీ జయంతికి, వర్ధంతికి, మహానాడుకి, ఎన్నికల సమయానికి.. ఆయన విగ్రహానికి దండేసి, దండం పెట్టడంలేదా చంద్రబాబు..? ఇది ఆయన మార్కు రాజకీయం అనుకోవాలా..?
ఇక వైశ్రాయ్ హోటల్ వద్ద జరిగిన ‘ఎన్టీఆర్ పై చెప్పుల దాడి’ సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా..? ఆ సమయంలో ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబుపై స్వయంగా ఎన్టీఆర్ చేసిన విమర్శలు, తిట్ల దండకాలు, పెట్టిన శాపనార్థాలు ఎవరైనా మరిచిపోతే యూట్యూబ్ లో ఆ వీడియో అందుబాటులోనే ఉంది కదా..?
ఈ విషయం ఎన్టీఆర్ కడుపున పుట్టినవారు, ఆయన వారసులిగా చెప్పుకునేవారు, ఆయన అభిమానులమని అనుకునేవారు మరిచిపోయినా.. చరిత్ర మరిచిపోలేదు, మరిచిపోదు కదా..?
ఇదే క్రమంలో… చంద్రబాబు తిరుపతిలో జేబులు కొట్టే దొంగ అని విమర్శించిన నాదెండ్ల భాస్కర్ రావు వ్యాఖ్యలు ఎవరైనా మరిచిపోతారా..? ఇప్పుడు ఆయన కుమారుడు చంద్రబాబు కేబినెట్ లో మినిస్టర్ గా లేరా..?
ఇక… మోడీ ఓ ఉగ్రవాది, దేశ ద్రోహి, గుజరాత్ అల్లర్లలో ఏమి జరిగిందో చూశారు కదా.. అలాంటి వ్యక్తిని మన రాష్ట్రంలోకి రానివ్వొద్దు.. అనే స్థాయిలో గతంలో నిప్పులు కక్కిన చంద్రబాబు.. ఆ సమయంలో రాహుల్ గాంధీతో కలిపి వేదికపై చేతులు ఊపిన చంద్రబాబు… ఇప్పుడు మాత్రం మోడీ వీరుడు, శూరుడు, ధీరుడు.. ఆయనను మించిన నాయకుడు లేడు అని భుజాలకు ఎత్తుకోవడంలేదా..? ఆయనను పొగడ్తలతో ముంచెత్తడం లేదా..?
ఇక చంద్రబాబును, నారా లోకేష్ ను ఒక్క రేంజ్ లో విమర్శించి.. తన తల్లిని అవమాన పరిచారంటూ ఆవేదన, ఆగ్రణం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్… తామంతా కలిసి మరో 15 ఏళ్లు అధికారంలో ఉండాలని.. లోకేష్ తన తమ్ముడని.. తాను చంద్రబాబు అనుభవానికి అభిమానిని, మద్దతుదారుడిని అని సన్నాయినొక్కులు నొక్కడం లేదా..?
రాష్ట్రానికి రెండు పాచిపోయిన లడ్డులు ఇచ్చారంటూ మోడీపై అటు తెలుగులోనూ, ఇటు హిందీలోనూ నాడు ఫైరయిన పవన్ కల్యాణ్… నేడు మోడీ అనే వ్యక్తి దేశం కోసమే పుట్టారని.. ఆయన మానవాతీత శక్తి అన్న రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించడం లేదా.. కనిపించినప్పుడల్లా కాళ్లకు దండాలు పెట్టడం లేదా..?
అంతెందుకు.. నేడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఉండి, నిత్యం ఆయన నామస్మరణ చేస్తున్న వాళ్లు ఎంతమంది నాడు చంద్రబాబుతో కలిపి ఆయనకు వెన్నుపోటు పొడవలేదు..? ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఎన్నెన్నో మరెన్నో..!
ఇదే సమయంలో… తాను అధ్యక్షుడిగా పనిచేసిన, తనను మంత్రిని చేసిన పార్టీని ఉద్దేశించి.. “పార్టీ లేదు, డ్యాష్ లేదు” అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించలేదా.. ఆ సమయంలో తన పార్టీ అధినేతలపై నోరు జారలేదా..?
ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే… ఇలా చెప్పుకుంటూపోతే కథ చాంతాడంతవదా..?
ఈ విషయాలనే ఇప్పుడు వైసీపీ కూడా రోడ్లపై ఫ్లెక్సీలుగా, గోడ్లపై పోస్టర్లుగా, పాత వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్స్ గా మార్చి పని మొదలు పెడితే… అది టీడీపీకి ఏ స్థాయిలో డ్యామేజ్ కలిగిస్తుందనేది ఇక్కడ కీలక పాయింట్.
టీడీపీ గోడెక్కడం వల్ల మహా అయితే బొత్స, ధర్మానతో పాటు మరికొంతమందికి తాత్కాలిక ఇబ్బంది కలిగితే కలగొచ్చు… మరి వైసీపీ ఇదే వ్యూహం, ఉద్దేశంతో రోడ్డెక్కితే… టీడీపీలో అసలు సిసలు కార్యకర్త, అసలు సిసలు నందమూరి తారకరామారావు అభిమాని ఎలా రగిలిపోతారు.. వీళ్లను ఏమి చేస్తారు..? … ఇవి సమాధానాలు దొరకని ప్రశ్నలైతే కాదు కదా..? తమ్ముళ్లకు తెలియని విషయాలైతే కాదు కదా..? మరి ఆ బూమరాంగ్ ని టీడీపీ తట్టుకోగలదా..?
