స్కిల్‌ స్కాం కేసు: బాబుకు రెగ్యులర్ బెయిల్‌… కండిషన్స్ కంటిన్యూ?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున రావు తీర్పు వెల్లడించారు. ఇందులో భాగంగా.. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఈ నెల 30వ తేదీన ఏసీబీ కోర్టు ముందు మాత్రం చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ప్రస్తుతం మధ్యతంతర బెయిల్ పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఈ మేరకు తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గతంలో ఇచ్చిన మద్యంతర బెయిల్ తరహాలోనే ఈ రెగ్యులర్ బెయిల్ లో కూడా మెరిట్స్ ప్రాతిపదికన కాకుండా… కేవలం ఆయన అనారోగ్య సమస్యలనే పరిగణలోకి తీసుకుందని తెలుస్తుంది.

తాజాగా చంద్రబాబు తరుపు లాయర్లు కోర్టులో సబ్ మిట్ చేసిన మెడికల్ రిపోర్ట్ లో… గుండె సైజు పెరిగిందని.. ఆయన ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా సమీపంలో ఒక అంబులెన్స్ ను ఉంచుకోవాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయలో కంటి ఆపరేషన్ విషయంలో కూడా మరింత రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్లు పెర్కొన్నారు! దీంతో కేసు మెరిట్స్ కి ఏమాత్రం సంబంధం లేకుండా… కేవలం ఆరోగ్య కారణాలను పరిగణలోకి తీసుకునే బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది.

ఇదే సమయంలో మధ్యంతర బెయిల్ సమయంలో చంద్రబాబుకు ఏయే కండిషన్స్ ఉన్నాయో… అవన్నీ ఈ బెయిల్ లో కూడా అప్లై అవుతాయని న్యాయవాదులు అంటున్నారు. ఇదే సమయంలో 17ఏ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో… ఏపీ హైకోర్టు ఈ విషయంపై ఎలాంటి కామెంట్లూ చేయలేదని తెలుస్తుంది. దీంతో చంద్రబాబు పొలిటికల్ మీటింగ్స్, బహిరంగ ర్యాలీలూ చేయవచ్చా? లేదా? అనే విషయంలో మరో పిటిషన్ వేయాల్సి ఉంటుందని సమాచారం!

వాస్తవానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పై వాదనలు ఈనెల 17న ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ క్రమంలో తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ పిటిషన్ పై చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించగా… సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

కాగా… స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబును సెప్టెంబర్‌ 9న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో సెప్టెంబర్‌ 10 అర్ధరాత్రి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో రోజూ భోజనం, మందులు, అల్పాహారం ఆయన ఇంటి నుంచే అందించే వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలో చంద్రబాబు సుమారు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు!