మే 26న జగన్ కు ఢిల్లీలో రెడ్ కార్పెట్!

కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా సౌత్ ఇండియా కేంద్రంగా జాతీయ రాజకీయాలు మారిపోతున్నాయి. నిన్నమొన్నటివరకూ భూమికి నాలుగు జేనల ఎత్తులో నడిచిన బీజేపీ పెద్దలు.. ఇప్పుడు కాస్త నేలపై నడుస్తున్నారు! దీంతో… దక్షిణాది రీజనల్ పార్టీలు ఎవరి లెక్కలు వారు వెసుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే టీడీపీ – జనసేనలు ఒక క్లారిటీకి వచ్చేసాయి. కచ్చితంగా బీజేపీ తమతో కలవడానికి అంగీకరిస్తాదనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో జగన్ హస్తినకు వెళ్తున్నారు!

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హస్తినకు బయలుదేరాల్సిన కార్యక్రమం ఒకటి తెరపైకి వచ్చింది. ఈ నెల 27న కేంద్ర విజ్ఞాన్ భవన్ లో నీతి అయోగ్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ కి దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు వస్తారనేది తెలిసిన విషయమే. వీరితోపాటు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులూ పాల్గొంటారు. అయితే… ఈ మీటింగ్ కోసం జగన్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. అది పెద్ద రాజకీయంగా పెద్ద విషయం కాకపోవచ్చు కానీ… జగన్ మాత్రం ఒక రోజు ముందే అంటే మే 26నే ఢిల్లీ వెళ్తున్నారు. దీంతో ఈ టూర్ కి పొలిటికల్ గా ప్రాధాన్యత పెరిగింది.

అవును… నీతి అయోగ్ మీటింగ్ కు ఒకరోజు ముందే జగన్ ఢిల్లీ వెళ్తున్నారు! పైగా అదే రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అవ్వబోతున్నారు! దీంతో… ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా తో భేటీ అంటేనే రాజకీయంగా చాలా ఆసక్తులను పెంచుతోంది అనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా… ఆ మరుసటి రోజు నీతి అయోగ్ మీటింగ్ అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ ప్రత్యేకంగా భేటీ అవుతారు అని తెలుస్తోంది.

దీంతో… ఈసారి జగన్ ఢిల్లీ యాత్రపై రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. పోలవరం, ప్రత్యేక హోదా సహా విభజన సమస్యల మీద మోడీ షాలతో జగన్ మాట్లాడుతారని తెలుస్తుంది. ఇదే సమయంలో 2024లో తమకు కేంద్రంలో ఎంపీల విషయంలో జగన్ సాయాన్ని మోడీ-షాలు ఒక మాట తీసుకునే అవకాశం కుడా ఉందొచ్చని అంటున్నారు. పైగా ఇంతకాలం మోడీ – షా ల పరిస్థితికి, కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని భావిస్తున్నారు. ఫలితంగా ఈసారి జగన్ కు ఢిల్లీలో బీజేపీ పెద్దలు రెడ్ కార్పెట్ వేయడమే కాకుడా… అడిగిన డిమాండ్లపై సానుకూలంగా స్పందించినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో ఒకపక్క బీజేపీతో మైత్రికోసం అటు జనసేన – ఇటు టీడీపీలు భారీ భారీ స్కెచ్చులు వేస్తుంటే… ఉన్నఫలంగా జగన్ తో అమిత్ ష, మోడీలు భేటీ అంటే… ఆ టూర్ తర్వాత ఏపీలో రాజకీయాలు ఎలా మారబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.