మార్గదర్శి చిట్ ఫండ్స్ కి సంబందించిన కేసులో ఏపీ సీఐడీ మరొకడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా… మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ లను ఏపీ సీఐడీ విచారిస్తోంది. హైదరాబాద్ లోని శైలజాకిరణ్ నివాసంలో ఆమెతో పాటు రామోజీరావును సీఐడీ విచారిస్తోంది. ఈ మేరకు దాదాపు 200 మంది సీఐడీ సిబ్బంది శైలజ ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది.
అవును… సంస్థ చైర్మన్ హోదాలో రామోజీరావు, ఎండీ హోదాలో శైలజా కిరణ్ లు నేడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా… రామోజీరావు, శైలజా కిరణ్ లకు ఏపీ సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పలు కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు… నలుగురు బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేశారు. చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారనే ఆరోపణలతో ఈ విచారణ మొదలైంది.
బ్యాలెన్స్ షీట్, చిట్ గ్రూప్ లకు చెందిన ఫాం 21ని కూడా మార్గదర్శి సంస్థ సమర్పించలేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు. మొత్తం ఏడు మార్గదర్శి బ్రాంచ్ ల్లో తనిఖీలు చేయగా అక్రమాలు జరిగినట్టు గుర్తించామంటున్నారు సీఐడీ అధికారులు. ఈ మేరకు ముందుగానే నోటీసులు ఇచ్చి ఈరోజు శైలజా కిరణ్ ఇంట్లో విచారణ చేపట్టిన అధికారులు… రామోజీరావుని కూడా అక్కడికే పిలిపించారు.
ఈ క్రమంలో… మార్గదర్శి వ్యవహారంలో అటు వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. రామోజీరావు చట్టానికి అతీతుడిగా వ్యవహరిస్తున్నారని.. తప్పు చేసి, కేసులు నమోదు చేస్తే కక్షసాధింపు అంటున్నారని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. కాగా… చిట్ ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే.
