పవన్ కళ్యాణ్ కు రామ్‌ చరణ్ ఓదార్పు

తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. బీఎస్పీ, వామపక్షాల మద్దతుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవన్‌కు ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. ప్రశ్నిస్తా అంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్‌.. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలవడంతో జనసేన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

భీమవరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో ఓటమి పాలైన జనసేనాని.. గాజువాకలో మూడో స్థానానికి పరిమితమై ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ తన బాబాయ్ ఓటమిని ఉద్దేశించి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 2019 ఏపీ ఎన్నికల ఫలితాలు ఉద్దేశిస్తూ ఆయన శుక్రవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్ చూసినవారంతా రామ్ చరణ్ ..పవన్ కు , జనసేన పార్టీకు ఓదార్పు చెప్తున్నట్లుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్నికల్లో తన బాబాయి పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ కోసం పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘గొప్ప నాయకుడు.. నాయకుడు అనిపించుకోవాలి అనుకోడు. మార్పును తీసుకొచ్చేందుకు ప్రయత్నించే వాడే నిజమైన నాయకుడు. పదవి ఏంటనేది ముఖ్యం కాదు, లక్ష్యం ఏంటనేదే ముఖ్యం. జనసేన పార్టీ, పవన్‌ కల్యాణ్‌ గారికి మద్దతుగా ఉండి, సేవ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ ఏపీ ఎన్నికలు 2019 అనే హ్యాష్‌ట్యాగ్‌ను రామ్‌ చరణ్‌ జత చేశారు.