టీడీపీకి రజనీకాంత్ పొలిటికల్ కాల్షీట్లు.!

ముప్ఫయ్యేళ్ళుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనకు మిత్రుడంటూ ప్రముఖ సినీ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. అందులో నిజం లేకపోలేదు.!

స్వర్గీయ ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలకు సంబంధించి, ప్రతిష్టాత్మక ఈవెంట్ నిర్వహించారు. నందమూరి కుటుంబ సభ్యులు నిర్వహించాల్సిన ఈ వేడుకని, తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. దీన్నొక రాజకీయ కార్యక్రమంగా భావించొచ్చేమో. స్వర్గీయ ఎన్టీయార్ గురించి మాట్లాడే క్రమంలో, టీడీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు రజనీకాంత్.

చంద్రబాబు విజన్ ప్రపంచానికి తెలుసనీ, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే, ఆంధ్రప్రుదేశ్ దేశంలోనే నెంబర్ వన్ అవుతుందని రజనీకాంత్ చెప్పడం గమనార్హం. స్వర్గీయ ఎన్టీయార్‌తో తనకున్న సాన్నిహిత్యం గురించీ, ఆయన్ని చూసి తాను ఇన్‌స్పైర్ అయిన విధానం గురించీ చెప్పారు తమిళ సూపర్ స్టార్.

కాగా, తన గురించి బహు గొప్పగా కీర్తించిన రజనీకాంత్‌ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు చంద్రబాబు. నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. అయినా, దీన్ని ఓ రాజకీయ కార్యక్రమంగా ఎందుకు మలచినట్లు.? ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు.

2024 ఎన్నికలకు సంబంధించి దీన్నొక ‘అవకాశం’గా చంద్రబాబు మార్చుకున్నారు. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం ఆయనకు అలవాటే.1