2019 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ పై నరసాపురం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన కనుమురి రఘురామ కృష్ణంరాజు అలియూస్ ట్రిపుల్ ఆర్… ఆ తర్వాత కాలంలో స్వపక్షంలో విపక్షంగా మారి, వైసీపీ అధినేత జగన్ ను, అధికారంలో ఉన్న ఆ పార్టీనీ తనదైన రాజకీయ వాక్ చాతుర్యంతో, తనదైన విశ్లేషణలతో ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టింది తెలిసిన విషయమే.
ఏమాటకామాట చెప్పుకోవాలంటే 151 స్థానాలతో అత్యంత బలంగా జగన్ పాలన సాగుతున్న దశలో, కరోనా కాలంలో అప్పటి ప్రతిపక్షాలు హైదరాబాద్ కే పరిమితమైన నేపథ్యంలో.. రఘురామ పూర్తి స్థాయిలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పొచ్చు.
తాను పార్టీకి విధేయుడిని, తమ అధినేత జగన్ ను విధేయుడిని అని అంటూనే… కాకపోతే వైసీపీ ప్రభుత్వానికీ, సీఎం జగన్ కు మాత్రం వ్యతిరేకిని అంటూ తనదైన వ్యంగంతో విరుచుకుపడేవారు.
దీంతో… ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటం.. ఆ సమయంలో ఆయనకు ఎవరు ఎంపీ టిక్కెటు ఇస్తే ఆయన ఆ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరగడం.. ఆయన హావభావాలు ఆ తరహాలోనే ఉండటం తెలిసిందే. కట్ చేస్తే… ఆ మూడు పార్టీలలో ఏ ఒక్క పార్టీ కూడా రఘురామకు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. చివరి క్షణంలో ఉండి అసెంబ్లీ టిక్కెట్టును ఆయనకు టీడీపీ కేటాయించింది!
ఆ ఎన్నికల్లో రఘురామ 56,777 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తదనంతరం… చంద్రబాబు కేబినెట్ లో కచ్చితంగా రఘురామకు ఛాన్స్ ఉంటుందని ఆయన అభిమానులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కుటమి పార్టీల కార్యకర్తలు భావించారు.. అందుకు ఆయన అర్హుడని.. కచ్చితంగా ఇవ్వాలని కోరుకున్నారు. కట్ చేస్తే… శాసనసభ ఉపసభాపతి పదవితో సరిపెట్టారు చంద్రబాబు!
దీనిపై రఘురామ కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్నారనే చర్చ అప్పట్లో నడవడం.. రఘురామ సైతం తనకు కూటమి ప్రభుత్వంలో దక్కిన గౌరవంపై తనదైన శైలిలో పెదవి విరవడం తెలిసిందే!
ఆ సంగతి అలా ఉంటే.. ఇటీవల ఉండి నియోజకవర్గంలోని ఆకువీడు మండలం పెదపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కొంతమంది స్థానికులు అడ్డుకున్నారు. దీంతో.. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
అయితే.. పెద్దపేటలో రామాలయ నిర్మాణానికి కొంతమంది మద్దతు పలుకుతుండగా.. మరింతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. తమ పేటలో రామాలయ నిర్మాణానికి తాము వ్యతిరేకమని స్థానికులు బలంగా చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయిన రఘురామ… అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడే రామాలయం కట్టి తీరతానని చెప్పారు.
ఆ వ్యవహారం అధికారులు, పోలీసుల ప్రమేయంతో ఎలా జరిగేది అలా జరిగిపోతే, జరగనిచ్చి ఉంటే సమస్య ఉండేది కాదనేది ఇక్కడ పాయింట్ గా ఉంది. ఈ గ్యాప్ లో రఘురామ కృష్ణంరాజు స్థానికంగా ఉన్న సుమారు 100కు పైగా చర్చిలకు నోటీసులు పంపించారని.. అయితే అనంతరం అధికారులు ఆ నోటీసులు వెనక్కి తీసుకున్నారని.. దీంతో రఘురామ మరింతగా రగిలిపోయారనే ప్రచారమూ జరిగింది.
ఈ నేపథ్యంలో… రాష్ట్రంలో ఉన్న దళితుల్లో మెజారిటీ దళితులు క్రైస్తవులుగా మారిపోయారని.. అసలు నూటి సుమారు 80 శాతానికి పైగా దళితులు చర్చిలకు వెళ్తోన్న నేపథ్యంలో.. వారికి ఎస్సీలకు వర్తించే రిజర్వేషన్స్ తో పాటు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవీ వర్తించవని.. ఈ విషయంలో తన పోరాటం ఆగదని వెల్లడించారు.
దీంతో… కూటమి ప్రభుత్వం దళితులకు, దళిత క్రైస్తవులకు, చర్చిలకు, మత స్వేచ్ఛకు వ్యతిరేకమనే ప్రచారం సొషల్ మీడియా వేదికగా ఊపందుకుంది! పైగా ఇది పూర్తిగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ సౌజన్యంతోనూ, ప్రోత్సాహంతోనే జరుగుతుందనే విమర్శలు ఓ వర్గం నుంచి బలంగా వినిపించాయి.
దీనికి తోడు రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్టు ఆశించే క్రమంలోనే రఘురామ ఈ తరహా కార్యక్రమాన్ని ఎత్తుకున్నారని.. ఆయనకు కుల అహంకారం ఎక్కువనే విమర్శలూ వినిపించాయి. అయితే తనకు అలాంటివి ఏమీ లేవని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేస్తూనే.. ఈ విషయంలో తన పోరాటం ఆగదని తెలిపారు.
ఇదంతా ఒకెత్తు అయితే… తాజాగా మీడియా ముందుకు వచ్చిన రఘురామ.. దేశంలోని 13 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకొచ్చారని.. అందులో 13వ రాష్ట్రంగా, ఇటీవలే మార్చి 30న మహారాష్ట్రలో యాంటీకన్వర్షన్ బిల్లు పాసయ్యిందని తెలిపారు. ఈ బిల్లు ప్రకారం… ఎవరిననా మాములుగా ఒత్తిడి చేసి మతమార్పిడి చేస్తే.. ఐదు సంవత్సరాలవరకూ శిక్ష పడుతుందని తెలిపారు.
అదేగనుక.. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వారిని మోసం చేసి, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, స్వస్థత చేకూరుస్తాం అని మోసాలు చేసి మత మార్పిడికి ప్రయత్నిస్తే 10 సంవత్సరాల వరకూ శిక్ష పడుతుందని తెలిపారు. దీన్ని ఉత్తరప్రదేశ్ లో అయితే 14 ఏళ్లకు పెంచడం జరిగిందని వివరించారు. ఈ తరహా బిల్లును దాదాపు అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ తీసుకొచ్చినట్లు తెలిపారు!
ఈ నేపథ్యంలోనే… “ఈ మధ్యన మన రాష్ట్ర నాయకులు కూడా అన్నారు.. అవసరమైతే ఇక్కడ కూడా ఈ చట్టం తీసుకురావాల్సి వస్తుందని.. మరి ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ కూటమిలో భాగస్వామి కాబట్టి తప్పకుండా…” అంటూ రఘురామ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో.. “దీనివల్ల నాలుగు ఓట్లు పోతాయేమో అనే భయం కొంతమందికి ఉంటే ఉండొచ్చు.. కానీ ఏదేమైనా ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది” అని నొక్కి చెప్పారు.
దీంతో… ప్రశాంతంగా సాగిపోతున్నట్లు కనిపిస్తున్న కూటమి పాలనలో రఘురామ కృష్ణంరాజు రాళ్లు వేస్తున్నారని.. 2024 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు గంప గుత్తగా అన్నట్లుగా కూటమికి మద్దతు పలికిన వేళ.. వాళ్లందరి రుణాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు బాగానే తీర్చుకుంటున్నారని.. దళితులు, క్రైస్తవులు, మైనారిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైగా… ఇంత జరుగుతున్నా దీనిపై చంద్రబాబు, పవన్ లు స్పందిచకపొవడంతో పాటు… కనీసం ఆఫ్ ది రికార్డ్ అయినా రఘురామతో మాట్లాడి ఆయనను కంట్రోల్ చేయలేకపోతున్నారా అనే చర్చా బలంగా నడుస్తోందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే… దళితులు, క్రైస్తవులను పూర్తిగా కూటమికి దూరం చేసే పనికి రఘురామ పూనుకున్నారా.. తద్వారా రాష్ట్రంలోని హిందూ ఓట్లన్నీ కూటమికే పడిపోతాయనే తనదైన నమ్మకంతో ఉన్నారా.. ఈ మేరకు కూటమి పెద్దలను ఒప్పించిన తర్వాతే ఈ పనికి పూనుకున్నారా.. అంటూ విశ్లేషకులు స్పందిస్తున్నారు.
ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో కూడా రఘురామ కృష్ణంరాజు తాజా వీడియోలు ఓ వర్గం ఓటర్లను కచ్చితంగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు పరిశీలకులు.
