వైఎస్ జగన్ పీఆర్వో అరెస్ట్… రీజన్ అదేనా..? 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా పొస్టులకు సంబంధించిన అరెస్టుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే! ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారనే విమర్శలు వైసీపీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

ఏ నేరానికి ఏ సెక్షన్ పెట్టాలి అనే నియమ నిబంధనలు ఏమీ లేకుండానే.. కాసిన్ని ఎక్కువ రోజులు రిమాండ్ లభించే సెక్షన్స్ పెట్టి ముందు లోపలికి పంపే పనికి పూనుకుంటున్నారనే విమర్శలు పలువురు వైసీపీ నేతల స్వానుభవం నుంచి వినిపిస్తున్నాయి. పైగా… రిమాండ్ అనంతరం జైలుకు తరలించిన తర్వాత అనధికారిక ట్రీట్ మెంట్ కూడా తీవ్రంగానే ఉంటుందని చెబుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి చీఫ్ పీఆర్వో, వైసీపీ మీడియా విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పూడి శ్రీ‌హ‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈరోజు ఉద‌యం శ్రీహరి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను బలవంతంగా వారి వాహనం ఎక్కించారని.. ఈ సమయంలో శ్రీహరితో పాటు ఉన్న వ్యక్తిని బెదిరించారని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆ వాహనం వెనుకాల వెళ్లిన కార్యకర్తలను, శ్రీహరి స్నేహితులను సైతం అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారని అంటున్నారు. అరెస్టు అనంతరం శ్రీహరి ఫోన్, ల్యాప్‌ టాప్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. శ్రీహరి అరెస్టుపై వైసీపీ వర్గాల్లో ఆందోళన మొదలైందని అంటున్నారు.

మరోవైపు… శ్రీహరిని పోలీసులు అరెస్టు చేస్తే.. ఎందుకు అరెస్టు చేస్తోంది, ఏ స్టేషన్ కు తీసుకెళ్తోందీ పోలీసులు వారి వారి కుటుంబ సభ్యులకు చెబుతారని.. అయితే తాజా అరెస్టు విషయంలో అలాంటి సమాచారం ఏదీ పోలీసుల నుంచి కుటుంబ సభ్యులకు రాలేదనే వాదనా వినిపిస్తోంది. దీంతో.. అతన్ని అరెస్టు చేసింది నిజంగా పోలీసులేనా.. లేక, పోలీసుల వేషధారణలో వచ్చిన వ్యక్తులు ఎవరైనా కిడ్నాప్ చేశారానే అనే ఆందోళనలు వినిపిస్తున్నాయి.

దీంతో… ఒక వేళ శ్రీహరిని నిజంగా ఏపీ పోలీసులే అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఉంటే… ఏ కేసుపై అరెస్టు చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారనే విషయాలు కనీసం కుటుంబ సభ్యులకైనా చెప్పేవారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కిడ్నాప్ సందేహాలు పలువురు వ్యక్తపరుస్తున్నారు! ఏది ఏమైనా.. మరోసారి వైసీపీకి సంబంధించిన వ్యక్తుల అరెస్టుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

కాగా… ప్ర‌భుత్వంతో పాటు కూట‌మి నేత‌ల‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో ఏ ఒక్క పోస్టు పెట్టినా వెంటనే అరెస్ట్ చేస్తున్నారని.. గత ప్రభుత్వ హయాంలో పోస్టులు పెట్టినవారిని ఇప్పటికే అరెస్టులు చేశారని.. ఈ ధోర‌ణిపై ఎన్ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా కూటమి ప్ర‌భుత్వం ఏ మాత్రం త‌గ్గ‌డం లేదని అంటున్నారు పరిశీలకులు.

మరోవైపు.. చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి యానిమేషన్‌ పోస్టింగ్‌ లు చేసినట్లు చిత్తూరులో కేసు నమోదైందని.. ఆ కేసు నిమిత్తమే శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీహరి అరెస్టు వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది వేచి చూడాలి.