ఆర్జీవీ ‘వ్యూహం’కి పేరడీ సిద్ధమవుతోందా.?

రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. వైసీపీనే నిర్మిస్తోంది ఈ సినిమాని. వైసీపీకి చెంది ఓ నేత పేరు ఈ సినిమాకి నిర్మాతగా కనిపిస్తోంది. కానీ, వైసీపీ తరఫున పలువురు నేతలు, ఈ సినిమాకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రామ్ గోపాల్ వర్మని పిలిపించుకుని మరీ, ఈ ‘వ్యూహం’ సినిమా గురించి చర్చించిన సంగతి తెలిసిందే. నో డౌట్, ఇది వైసీపీకి అనుకూలమైన సినిమా. కాదు కాదు, ఇదొక ప్రచార చిత్రం. రాజకీయాలన్నాక ఇలాంటివన్నీ కామన్.

కేవలం వైసీపీకి అనుకూలమైతే సరిపోదు, వైసీపీకి వ్యతిరేకంగా వున్న పార్టీలను ర్యాగింగ్ చేసేలా ‘వ్యూహం’ వుండాలన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ ‘పని’ మొదలెట్టాడు.. దాదాపు పూర్తి చేసేస్తున్నాడు’ కూడా. అయితే, ఇక్కడే చిక్కు వచ్చి పడింది. వైఎస్ జగన్ ఇమేజ్‌ని ఎలివేట్ చేయడం మీద పెట్టిన ఫోకస్ కంటే, చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్‌ని ర్యాగింగ్ చేయడానికి ఎక్కువ ‘లెంగ్త్’ తీసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. మధ్యలోకి చిరంజీవిని కూడా లాగాడట.

ఈ నేపథ్యంలో, ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాకి కౌంటర్ ఎటాక్‌గా ఇంకో సినిమా షురూ అయినట్లు తెలుస్తోంది. ఎవరు నిర్మాత.? ఎవరు దర్శకత్వం.? అన్న విషయాలపై స్పష్టత లేదు. కానీ, స్క్రిప్టు మాత్రం పక్కాగా వుందిట. ‘వ్యూహం’ సినిమా కోసం వర్మ రిలీజ్ చేస్తున్న పోస్టర్లు, ప్రోమోలో.. వీటిని ఆధారంగా చేసుకుని, ‘స్పూఫ్’లు రూపొందిస్తున్నారట.

ప్రధానంగా వైఎస్ వివేకా హత్య అలాగే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం.. వంటి అంశాల్ని, వేరే యాంగిల్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ‘వ్యూహం’ రిలీజ్‌కి ఓ వారం.. పదిహేను రోజులు అటూ ఇటూగా ఈ ‘పేరడీ’ సినిమా రిలీజ్ కావొచ్చునట.