పవన్ కళ్యాణ్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే.!

ఎవరో ఏదో అంటున్నారని.. ప్రతిసారీ రుజువులు చూపించుకుంటూ పోతే ఎలా.? పవన్ కళ్యాణ్ విషయమై జనసైనికులు కొందరిలో వ్యక్తమవుతున్న ఆవేదన ఇది.!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్, తన మూడో భార్యకీ విడాకులు ఇచ్చేశారంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. లోకల్ మీడియాలో మొదలైన ఈ పుకార్ల పర్వం, నేషనల్ మీడియా వరకూ పాకేశాయి.

గతంలో అయితే, ఇలాంటి గాసిప్స్‌ని జనసేనాని పట్టించుకునేవారు కాదు. కానీ, ఇప్పుడాయన మారిన మనిషి. జనసైనికులకు తప్పుడు సంకేతాలు వెళతాయని అనుకున్నారేమో, తన భార్య అన్నా కొణిదెలతో కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియాలో పార్టీ హ్యాండిల్ ద్వారా షేర్ చేయించారు.

వారాహి విజయ యాత్ర నేపథ్యంలో హైద్రాబాద్‌లో ప్రత్యేక పూజల సందర్భంగా తీసిన ఫొటో అట అది. నిజానికి, ఈ ఫొటో వల్ల జనసేనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. ఫొటో కొత్తది కాదు, పాతది.. అంత చిత్తశుద్ధి వుంటే, భార్యని వెంటేసుకుని మీడియా ముందుకు రావాలంటూ సవాల్ విసిరేస్తున్నారు కొందరు.

నిజానికి, ఇలా వ్యక్తిగత జీవితాల్ని బజారుకి లాగాలని చూడటం మీడియాకి తగని పని. కానీ, అది ఇప్పుడున్న మీడియాకి ఓ సరదా వ్యవహారం అయిపోయింది. వైసీపీనే, ఈ మొత్తం తతంగానికి తెరవెనుక కథ నడిపిస్తోందన్నది నిర్వివాదాంశం. దానికి అనూహ్యంగా టీడీపీ అనుకూల మీడియా కూడా వంత పాడుతోంది.

అన్నా కొణిదెల ఫొటోని విడుదల చేయడం దండగ.. అని జనసైనికులు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న దరిమిలా, పార్టీ నాయకత్వం కూడా కొంత డిఫెన్స్‌లో పడిపోయి వుండొచ్చు.