పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి .. ముగ్గురికి తీవ్ర గాయాలు !

జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ మద్యే ఏపీలో వచ్చిన నివర్‌ తుపాను కారణంగా జరిగిన పంటనష్టాన్ని పరిశీలించేందుకు పవన్‌ కల్యాణ్‌ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.

జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కు కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం కంకిపాడు, పామర్రు తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పవన్ వెంట వెళ్తున్న కార్యకర్తల బైక్‌ లు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు జనసేన కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో వెంటనే చికిత్స నిమిత్తం వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ర్యాలీలో తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు పవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు భరోసా ఇచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు ఆర్థిక సాయం వచ్చే కృషి చేస్తామన్నారు. అధైర్య పడొద్దని రైతులకు ధైర్యం చెప్పారు. రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు.