ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు, పవన్, జగన్, బీజేపీ రాజకీయాలపై చాలా మందికి ఫుల్ క్లారిటీ ఉంది కానీ… ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో వైఎస్ షర్మిల చేసిన, చేస్తున్న రాజకీయంపై మాత్రం చాలా మందికి క్లారిటీ లేదని అంటారు. ఏపీలో కూటమి మరో 15 ఏళ్లు అధికారంలో ఉండాలంటూ.. చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని, అవసరాన్ని పవన్ వ్యక్తపరుస్తుంటారనే సంగతి తెలిసిందే. దీనిపై “దత్త పుత్రుడు” అనే విమర్శలు వచ్చినా.. జన సైనికుల పని పసుపు జెండాలు మోయడమే అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపించినా.. వాటిని పవన్ లైట్ తీసుకుంటారు!
ఇక దక్షిణాధిలోనూ జెండాలు పాతాలని బలంగా భావిస్తోన్న బీజేపీ కి పవన్ అవసరం చాలా ఉందని అంటారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ చంద్రబాబు భాగస్వాములు మారతుంటారని అంటున్న వేళ.. ఈసారి బీజేపీ ప్లస్ జనసేనతోనే ఆయన ప్రయాణం ఉంటుందా.. లేక, వారిద్దరితోనూ ఏదైనా విభేధాలు వచ్చినా.. లేక, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి అని భావించినా.. వారిద్దరూ విడి విడిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని 2014నాటి ఘటనలు గుర్తు చేసుకుంటుంటారు ఇంకొంతమంది. ఇదే సమయంలో చంద్రబాబు హస్తం చేతిలో చెయ్యి వేసినా ఆశ్చర్య పోనక్కరలేదని అంటారు.
ఆ సంగతి అలా ఉంటే… ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెరపైకి తేవడంతో.. ఆయనను జోకర్ గా చిత్రీకరించారు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. అలా అని ఆమె అమరావతికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లేనా అంటే.. దానికీ క్లారిటీ లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో… జగన్ జోకర్ సంగతి అలా ఉంచితే… ఏపీలో ముగ్గురు మాత్రం చంద్రబాబు బ్రోకర్లుగా మారి పనిచేస్తూ, మాట్లాడుతున్నారని వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ తో తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా… జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా షర్మిలపై నేరుగా అటాక్ చేస్తున్న శివప్రసాద్ రెడ్డి… చంద్రబాబు కోసం తాను చెప్పబోతున్న ముగ్గురు బ్రోకర్లు ఎలా నిస్సిగ్గు పనులకు పాల్పడుతుంది వివరించారు. ఇందులో భాగంగా… షర్మిల చిలక పలుకులు, మీడియాధిపతి ఆర్కే రోత పలుకులు, డిప్యూటీ సీఎం పవన్ ప్యాకేజీ పలుకులు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా… మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్ ను జోకర్ అని షర్మిల ఏ రకంగా మాట్లాడుతుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ అంశం.. చంద్రబాబుకు, ఆయన్ను సమర్థించేవారికి మాత్రమే నచ్చలేదని రాచమల్లు స్పష్టం చేశారు. జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన చంద్రబాబుతో పాటు ఆయన అనుకూల మీడియాకు నచ్చలేదు అని అనుకుంటున్న వేళ.. తాజాగా షర్మిలమ్మ ఎంట్రీ ఇచ్చారని.. అమరావతిలో రాజధాని నిర్మించడానికి అవకాశం లేదని ప్రపంచ బ్యాంక్ చెప్పిందని అన్నారు. ఇదే విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా స్పష్టం చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా… అమరావతి పేరు చెప్పి దాని వెనుక జరుగుతున్న అక్రమాలు, ఆర్థిక పరమైన దారుణాలను రాచమల్లు ప్రస్థావించారు. ఈ విషయాలు అన్నీ షర్మిలమ్మకు తెలుసని చెప్పిన రాచమల్లు… అసలు ఏపీ రాజధానిపై మీ స్టాండ్ ఏంటో చెప్పాలని షర్మిలను డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో… ప్రతీ ఏటా వర్షాకాలంలో అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వరద నీరు ఎత్తిపోసే కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో… ఇకపై జగన్ పై షర్మిల చేసే విమర్శలపై కచ్చితంగా స్ట్రాంగ్ కౌంటర్స్ తప్పవనే సంకేతాలు వైసీపీ నుంచి బలంగా వినిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
