పహల్గామ్ ఉగ్రదాడిపై జాతీయస్థాయిలో ఉద్వేగం వెల్లువెత్తింది. ఈ దాడిలో ఏపీ నుంచి వచ్చిన పర్యాటకులు సహా 26 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ఇదే సమయంలో పాక్పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. అందరికన్నా స్పష్టమైన స్టాండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న తీరు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
బీజేపీ భాగస్వామిగా ఉన్న జనసేన నాయకుడిగా పవన్ మాటలు మరింత బలంగా వినిపించాయి. ప్రత్యేకంగా పేరు లేకపోయినా, పాక్కు మద్దతు ఇస్తే దేశం వదిలి వెళ్లిపోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అజెండా మార్చేశాయి. రాష్ట్ర బీజేపీ నేతలు నిరసన ర్యాలీలు, కాండిల్ మార్చ్ లతో పరిమితమవుతుండగా, పవన్ మాటలు నేరుగా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి.
బీజేపీ అనుకూల న్యూస్ ఛానెళ్లు, ఇతర రాష్ట్రాల మీడియా కూడా పవన్ మాటలను ప్రముఖంగా హైలైట్ చేయడం విశేషం. హిందీలోకి అనువదించి కూడా ఆ వ్యాఖ్యలు వైరల్ అవ్వడం, కేంద్ర నేతలు ఆ స్టేట్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టారని వినిపిస్తోంది. దీంతో పవన్ రాజకీయ ప్రాధాన్యత మరింత పెరిగిందనే అభిప్రాయం ఏర్పడింది.
ఇక రాష్ట్ర రాజకీయంగా చూస్తే, పవన్ ఇదే విధంగా గతంలో తిరుమల వ్యవహారం, తిరుపతి తొక్కిసలాట ఘటనలపై గట్టిగా స్పందించి తన స్టాండ్ స్పష్టంగా చెప్పిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అదే తరహాలో పాకిస్థాన్పై ధైర్యంగా స్పందించిన పవన్.. ఏపీ బీజేపీకి మించి మైలేజ్ దక్కించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టనర్గా ఉన్నా.. పవన్ ప్రసెన్స్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైందని చెప్పవచ్చు.