పవన్ కళ్యాణ్ ఉవాచ.! 20 సీట్లు.. 10 వేల కోట్లు.!

అసలు సీట్ల పంపకాల ప్రస్తావన ఇప్పుడెందుకు.? ఎవరెవరో ఏవేవో మాట్లాడుతుంటారు. అధినేత ఈ విషయమై స్పందించడమే అనవసరం. కానీ, 20 సీట్లంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రచారంలో వున్న విషయాన్నీ, కొందరు తన వద్ద ప్రస్తావిస్తున్న అంశాలన్నీ జనసేనాని పేర్కొనడం కొత్త అనుమానాలకు తావిచ్చింది.

ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ‘కొత్త పలుకు’లో ‘జనసేనానికి వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చేందుకు గులాబీ బాస్ కేసీయార్ ప్రయత్నించారు’ అంటూ రాసుకొచ్చారు. అది చంద్రబాబునాయుడు రాయించిన రాతేనన్నది జగమెరిగిన సత్యం. నిజానికి, ఈ విషయమై జనసేన నుంచి చాలామంది నేతలు ఖండించారు.. అక్కడితో పనైపోయింది. కానీ, వెయ్యి కోట్లు కాదు.. పది వేల కోట్లు అయినా, డబ్బుతో పార్టీని నడపలేం.. అన్న ప్రస్తావన పవన్ కళ్యాణ్ ఎందుకు చేశారో ఏమో.! మరోపక్క, టీడీపీ ఇస్తున్న లీకుల ప్రకారం జనసేనకు 20 సీట్లు పొత్తులో భాగంగా.. అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపైనా జనసేనాని మాట్లాడారు.

అంటే,20 కోట్లు ఇచ్చి.. 10 వేల కోట్లు కూడా ఇస్తే.. డీల్ సెట్ అయిపోతుందన్నమాట.. అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌ని రాజకీయ ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నారు. ఇలా ట్రోల్ చేస్తున్నవారిలో వైసీపీ మద్దతుదారులే ఎక్కువ. చిత్రంగా టీడీపీ అలాగే గులాబీ పార్టీ మద్దతుదారులు కూడా ఈ ట్రోలింగ్‌లో పాల్గొంటున్నారు. అవసరమా ఇలా కెలుక్కోవడం జనసేనానీ.?