నాగబాబు, వరుణ్ తేజ్ లకు కృతజ్ఞతలు: పవన్

జనసేన పార్టీకి నాగబాబుకి, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ విరాళం ఇచ్చారు. దాంతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారిద్దరికి కృతజ్ఞతలు తెలిపారు . ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘జనసేన పార్టీ మీద అభిమానంతోను, ఈ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న కాంక్షతో నా చిన్న అన్నయ్య నాగబాబు, ఆయన కుమారుడు, హీరో వరుణ్ తేజ్ లు పార్టీకి అందించిన విరాళానికి నేను పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

నాగబాబు గారు రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ కోటి రూపాయల వంతున పార్టీకి విరాళం అందజేశారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నాగబాబు, వరుణ్ తేజ్ లు అందించిన విరాళాలు పార్టీకి క్రిస్మస్ కానుకగా నేను భావిస్తున్నా’ అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కుటుంబంతో కలసి ప్రస్తుతం యూరప్ ఉన్నారు. తాజాగా క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో జనసేనాని ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ పండుగ ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రజలంతా శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన అధినేత ఫేస్ బుక్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. అలాగే దీనికి క్రిస్మస్ ట్రీ ఫొటోను పవన్ జతచేశారు.