దున్నపోతు ఈనింది… దూడను కట్టేయండి తమ్ముళ్లూ!!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటింది. ఇప్పటి వరకూ ప్రజలకు చేసిందేందయ్యా అంటే… సామాజిక పెన్షన్ పెంపు హామీ అమలు తప్ప మరేమీ లేదు! “ఉచిత ఇసుక”లో ఉచితం లేదు! మిగిలిన సూపర్ సిక్స్ హామీల ఊసే లేదు! మరి ఏమి చేశారంటే… శ్వేతపత్రాలు విడుదల చేశారు! ఇక ఏపీలో ఎక్కడ ఏమి జరిగినా అది వైసీపీ పనే అంటూ తమ చేతకానితనాన్ని బయటపెట్టుకుంటునారు!!

ప్రస్తుతం ఏపీలో ఇలాంటి చర్చ మొదలైందని అంటున్నారు. ఏపీలో మహిళా సంక్షేమం కోసం చంద్రబాబు, ఆడపిల్లల భద్రతపై పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలో చేసిన ప్రచారాలు అన్నీ ఇన్నీ కాదు. అయితే… చంద్రబాబు ఇప్పుడు ఆ హామీలపై స్పందిస్తూ.. ‘భయమేస్తుంది’ అనే మాటలు మాట్లాడుతుంటే… పవన్ కల్యాణ్ మాత్రం పక్క రాష్ట్రం నుంచి ఏనుగులను దిగుమతి చేసే పనిలో ఉన్నారని అంటున్నారు.

ఇక తాజా విషయానికొస్తే ఏపీలో ఏ మూల ఏమి జరిగినా అది వైసీపీ నాయకుల పనే అని.. ఇది జగన్ & కో చేసిన కార్యక్రమమే అని ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేస్తున్నారు లోకేష్ & కో! ఈ క్రమంలో తాజాగా జరిగిన రెండు ఉదాహరణలు అయితే లోకేష్ & కో కి చెంపపెట్టనే కామెంట్లకు కారణం అవుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నది తామే అనే విషయం కూటమి నేతలు మరిచిపోయినట్లున్నారని అంటున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీ ప్రజానికం కూటమి పార్టీలకు పట్టం కట్టారు. అందుకు కారణాలు ఏమైవా కానీ… కానీ… తాము అధికారంలో ఉన్న విషయం మరిచిపోయినట్లుగా కూటమి నేతలు కామెంట్లు చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అధికారంలో ఉన్న తమకంటే 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న జగన్ చాలా బలవంతుడు అన్నట్లుగా వారి చేష్టలు, మాటలు ఉంటున్నాయని చెబుతున్నారు.

ఉదాహరణకు… నాలుగు రోజుల క్రితం కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో తెలుగుదేశం పార్టీ నేతను కొంతమంది వ్యక్తులు దారుణంగా హతమార్చారు. గత బుధవారం తెల్లవారుజామున మాజీ సర్పంచ్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రధాన అనుచరుడు వాకిటి శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్లాగా దుండగులు కళ్లల్లో కారం చల్లి హత్య చేశారు. దీంతో… చినబాబు లోకేష్ లైన్లోకి వచ్చేశారు.

పత్తికొండలో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేశాడనే కక్షతోనే శ్రీనివాసులు కళ్లల్లో కారం కొట్టి కిరాతకంగా చంపేశారని చెప్పుకొచ్చారు. జగన్ & కో తన పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ సహనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని అన్నారు.

కట్ చేస్తే… శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. తెలుగుదేశం పార్టీకే చెందిన నర్సింహులే ఈ హత్య చేశాడని తేల్చారు. గతంలో నర్సింహులును శ్రీనివాసులు చెప్పుతో కొట్టడం ఒక కారణం అయితే… శ్రీనివాసులుకే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్ పదవి వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నర్సింహులు జీర్ణించుకోలేకపోయాడని.. అదే ఈ హత్యకు కారణం అని అన్నారు.

దీంతో… లోకేష్ & కో పై వైసీపీ శ్రేణులూ, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సుతా మొదలూ తెలియకుండా అసత్య ఆరోపణలు, అజ్ఞానపు ప్రేళాపనలు ఏలా అని ఫైరవుతున్నారు! అయితే… శ్రీనివాసులు హత్యపై పోలీసుల క్లారిటీ అనంతరం చినబాబు మౌనం వహించారు ఆ విషయంపై!

ఇక తాజాగా దవలేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో ఫైళ్ల దగ్దం వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఫార్ముళా అప్లై చేశారు టీడీపీ నేతలు, మీడియా అని చెప్పుకునే ఓ వర్గం మీడియా! ఇందులో భాగంగా… దగ్దమైన దస్త్రాలన్నీ పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ విభాగం ఫైళ్లని, గత ప్రభుత్వంలోని పెద్దలే ఈ పనికి పూనుకున్నారని ప్రచారం మొదలుపెట్టారు.

ఇక జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, జనసేన మంత్రి అక్కడకు చేరిపోయి హడావిడి చేశారు. అయితే… కొత్త బీరువాలు రావడంతో ఫైళ్లను వాటిలో సర్ధినప్పుడు రద్దును మాత్రమే బయటపడేసి కాల్చినట్లు ఆర్డీవో శివజ్యోతి క్లారిటీ ఇచ్చారు. దగ్ధమైన ఫైల్స్ పోలవరం ఎడమ కాలువ పరిహారానికి సంబంధించినవి కావని ఆర్ & ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ స్పష్టం చేశారు. దీంతో… ఈ విషయం కూడా అసత్య ప్రచారమని తేలిపోయింది.

దీంతో… ఇంకా ఎంత కాలం గత ప్రభుత్వ పాలనపైనా, వైసీపీ నేతలపైనా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు! కనీసం సమాచరం లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం.. తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాక తలలు ఎక్కడో పెట్టుకోవడం ఎందుకని నిలదీస్తున్నారు! ఇకపై అయినా… దున్నపోతు ఈనిందంటే దూడను తీసుకెళ్లి కట్టేయండి అనేలా బ్లైండ్ స్టేట్ మెంట్స్ ఇవ్వొద్దని సూచిస్తున్నారు!