వైఎస్ కుటుంబంలో ‘అలాంటి అన్న’.. ‘ఇలాంటి చెల్లి’!

‘వైఎస్సార్’… ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కళ్లు ఆయన చేసిన మేలులను తలచుకుని ఆనందంతో, ఆయన అకాల మరణం గుర్తొచ్చి బాధతో ఒకేసారి చెమ్మగిల్లుతాయి! ఇదే సమయంలో.. హస్తిన రాజకీయాలు సైతం ఆ పేరు గుర్తొస్తే మరోసారి గతానికి వెళ్లిపోతాయి. ప్రజల గుండెల్లోనూ, నాయకుల మదిలోనూ వైఎస్సార్ లెక్కే వేరు. అలాంటి మహానేత కుటుంబ వ్యవహారాలు గత కొంతకాలంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పినట్లు… పులివెందుల పూల అంగళ్ల సర్కిల్‌ లో పరచబడటం కచ్చితంగా ఆ ఫ్యామిలీ అభిమానులకు ఏమాత్రం జీర్ణించుకోలేని విషయమే!

ఈ సమయంలో.. ఇటీవల కాస్త గ్యాప్ ఇచ్చినట్లు కనిపించిన వైఎస్ షర్మిల మరోసారి మైకుల ముందుకు వచ్చి.. తన సోదరుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు! ఈ సందర్భంగా… ‘అన్న అనే పదానికే కళంకం తీసుకొచ్చింది వైఎస్ జగన్’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు’ అంటూ మరో అడుగు ముందుకు వేశారు ఏపీ పీసీసీ చీఫ్. దీంతో… వైఎస్ ఫ్యామిలీ గౌరవాన్ని షర్మిల రోజు రోజుకీ రోడ్డుకు తెచ్చేస్తున్నారంటూ ఆయన అభిమానులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో వైఎస్ షర్మిల.. వైఎస్ జగన్ పైనా, వైసీపీ నేతలపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో రాజకీయ విమర్శలు ఎక్కువగా ఉండగా, ఇది రాజకీయ ధర్మం అని చాలా మంది సరిపెట్టుకున్నారు. కానీ… కాలం గడిచే కొద్దీ పూర్తిగా అవి వ్యక్తిగత విమర్శలుగా మారిపోవడం.. టీడీపీ నేతల్లాగానే జగన్ పై వ్యక్తిత్వ హనానికి పాల్పడే పనికి పూనుకోవడంతో.. షర్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలా.. లేక, టీడీపీ అధికార ప్రతినిధా అనే కామెంట్లు వినిపించాయి.

వాస్తవానికి వైఎస్ జగన్ సమస్యల్లో ఉన్న సమయంలో షర్మిల రంగంలోకి దిగినప్పుడు ఆమెను “జగనన్న వదిలిన బాణం” అంటూ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానించారు, స్వాగతించారు, ఆదరించారు. అయితే… ఇప్పుడు మాత్రం ఆమెను.. “సొంత అన్నపైకి చంద్రన్న వదిలిన బాణం”గా అభివర్ణిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇది షర్మిల రాజకీయ భవిష్యత్తుకే కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సైతం సమస్యగా పరిణమించే అవకాశం ఉందని అంటున్నారు! వీరి వ్యక్తిగత అంశాల సంగతి కాసేపు పక్కనపెడితే.. వైఎస్ కుటుంబ గౌరవానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందిస్తున్న వైసీపీ నేతలు.. ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని.. ఇలా రోడ్డుకు ఎక్కడం ఏమాత్రం సమర్ధనీయం కాదని సూచిస్తున్నారు. పైగా.. మీ ఇంట్లో ఏదైనా చర్చించుకుంటే మరుసటి రోజే ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్‌ ఐటమ్‌ గా వస్తుందని.. ఇవన్నీ వారికి ఎవరు చెప్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. షర్మిల, సునీతల ఫోన్లు పరిశీలిస్తే ఏబీఎన్‌ రాధాకృష్ణ, చంద్రబాబుతో టచ్‌ లో ఉన్న విషయం ఇట్లే బయటపడుతుందని నొక్కి చెబుతున్నారు. కోట్లాది మంది “జగనన్న” అని అభిమానంగా పిలుచుకునే వ్యక్తి ఏకంగా “అన్న” అనే పదానికే కళకం అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

ఇక్కడ షర్మిల గమనించాల్సిన విషయం ఒకటే… ఫ్యామిలీ విషయాలపై స్పందిచడానికి వీధికి ఎక్కడం వల్ల పరోక్షంగా తన కుటుంబ గౌరవం కూడా పోతుందనే విషయం గుర్తుంచుకోవాలని అంటున్నారు పరిశీలకులు. జగన్ ను రాజకీయంగా, వ్యక్తిగతంగా బద్నాం చేస్తున్నాననే మాయలో, మైకంలో.. తన తండ్రి గౌరవాన్ని, తన పుట్టింటి విలువలకు మచ్చ తెచ్చే పని చేస్తున్నాననే విషయం మరిచిపోతున్నారని గుర్తుచేస్తున్నారు! మరి అలాంటి అన్న గురించి ఇలాంటి చెల్లి ఇకనైనా నడి రోడ్డుపైనా, మైకుల ముందు స్పందిచడం మాని.. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే పనికి పూనుకుంటారా.. లేక, ఇలా పరోక్షంగా కూటమి కోసం కష్టపడుతూనే ఉంటారా అనేది వేచి చూడాలని అంటున్నారు విశ్లేషకులు!