మంత్రి హరీష్ పైనా మానవ అక్రమ రవాణా ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో ఇది మరొక బిగ్ బ్రేకింగ్. మానవ అక్రమ రవాణా కేసును తెలంగాణ సర్కారు తిరగదోడింది. 14 ఏండ్ల ఈ కేసును తిరగదోడి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తెలంగాణ సర్కారు కటకటాల వెనక్కు నెట్టింది. 13రోజులపాటు జైలులో ఉండి వచ్చిన జగ్గారెడ్డి దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. తన తప్పు ఏమీ లేదన్నారు. అయినా కోర్టులంటే తనకు గౌరవం ఉందని, కోర్టుల్లో ఫైట్ చేసి తన నిర్దోశిత్వాన్ని నిరూపించుకుంటానన్నారు.

అయితే ఎప్పటినుంచో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మీద పాస్ పోర్ట్ కుంభకోణంలో హస్తముందన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు పదే పదే ఈ తరహా ఆరోపణలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి పదే పదే కేసిఆర్ మీద కూడా కేసులున్నాయి. కేసుల నుంచి రక్షణ కోసమే కేంద్రంలో బిజెపి సర్కారుకు కేసిఆర్ మద్దతు ఇస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.  అంతేకాదు మంత్రి హరీష్ రావు మీద కూడా మానవ అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అవి ఆరోపణలుగానే ఉన్నాయి తప్ప నిజ నిర్దారణ కాలేదు.

ఎప్పుడైతే జగ్గారెడ్డి మీద మానవ అక్రమ రవాణా కేసును 14 ఏండ్ల తర్వాత రీఓపెన్ చేశారో ఆనాటి పరిణామాలన్నీ చర్చకొస్తున్నాయి. జగ్గారెడ్డి జైలు పాలైన తర్వాత మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 27వ తేదీ, ఏప్రిల్ నెల 2007 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి పత్రికలో మొదటి పేజీలో ‘‘అందరూ దొంగలే’’ అనే హెడ్డింగ్ తో అచ్చయిన ఒక వార్తా కథనం సంచలన విషయాలను వెల్లడిస్తున్నది. మూసి టివి  జర్నలిస్టు పిట్టల శ్రీశైలం 14 ఏళ్ల క్రితం నాటి పత్రికా కథనాన్ని విడుదల చేశారు. మూసి టివి వెలువరించిన పేపర్ క్లిప్పింగ్ కింద ఉంది చూడండి.

పాస్ పోర్ట్ కుంభకోణం అప్పుడే వెలుగుచూసింది. అప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలంతా ఈ పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇరుక్కుపోయారని, ప్రత్యక్ష సంబంధాలున్నాయని పత్రికా కథనంలో పేర్కొన్నారు. పార్టీ అధినేత మొదలుకొని కింది స్థాయి నాయకులంతా ఇన్వాల్వ్ అయినట్లు కథనంలో పేర్కొన్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి తన భార్యాపిల్లలను కాదని పరాయి భార్యా పిల్లలను కిరాయి కోసం అమెరికా తరలించారని టిఆర్ఎస్ నేతలు బలంగా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితులున్నాయి. కానీ ఆరోజుల్లో ఇదే తరహా కార్యకలాపం తన్నీరు హరీష్ రావు కూడా చేపట్టారని ఆ కథనంలో లిఖించబడి ఉంది.

హరీష్ రావుతో పాటు ఇప్పటి జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కాశిపేట లింగయ్య, అప్పటి కేంద్ర మంత్రి, దివంగత నేత ఆలే నరేంద్ర, అప్పటి ఎంపి రవీంద్ర నాయక్ పేర్లు కూడా ఉన్నట్లు పత్రికా కథనంలో పేర్కొన్నారు. పాస్ పోర్ట్ ఏజెంట్ రషీద్ ఈ వ్యవహారంలో అసలు సూత్రధారి అని, అతడు ఆ సమయంలో పరారీలో ఉన్నట్లు కథనంలో పొందుపరిచారు. రషీద్ ను పట్టుకుంటేనే అసలు వివరాలు వెల్లడవుతాయని కథనంలో వివరించారు.

అయితే ఈ కేసులో తదుపరి కాశీపేట లింగయ్య అరెస్టయ్యారు. తాజాగా జగ్గారెడ్డి అరెస్టయ్యారు. మిగతా వారంతా అరెస్టు కాలేదు. మరి ఈ కథనంలో వచ్చిన పేర్లన్నీ నిజమా కాదా అన్నది సమగ్ర విచారణ జరిపితే తేలే అవకాశం ఉంది.

మూసి టివి లైబ్రరి నుంచి తీసుకున్న ఆనాటి ఆంధ్రజ్యోతి పత్రికా కథనం ఇదే.