చంద్రబాబు వ్యూహాన్ని బట్టబయలు చేసిన హ‌రీష్ రావు !

Harish rao made sensational comments on Chandrababu naidu

సిద్దిపేట : టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హ‌రీష్ రావు తాజాగా ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ముసుగులో చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. నాలుగవ విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండ‌లం క‌ల్లెప‌ల్లి గ్రామంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌తో క‌లిసి మంత్రి హ‌రీష్ రావు ప‌ర్య‌టించారు. ఈ పర్యటనలో మండల వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Harish rao made sensational comments on Chandrababu naidu

ఈ పర్యటన సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హ‌రీష్ మాట్లాడుతూ… టీడీపీ ముఖం పెట్టుకుని వ‌స్తే తెలంగాణ ప్ర‌జ‌లు రానివ్వ‌ర‌ని, త‌న మ‌న‌షుల‌కు కాంగ్రెస్‌లోకి పంపి ఆ విధంగా రాష్ట్రంలోకి చంద్ర‌బాబు అడుగు పెడుతున్నార‌ని తెలిపారు. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెల‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తే… చంద్ర‌బాబును తెలంగాణ ప్ర‌జ‌లు త‌రిమేశారు అని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్‌ పదవి దక్కటానికి చంద్రబాబు చేసిన లాబీయింగ్ కారణమన్నారు. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు, అనుచరుడు అయిన రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీలో త‌న వాళ్ల‌కు ప‌ద‌వులు ఇప్పించుకుంటున్నారని హ‌రీష్ రావు పేర్కొన్నారు.