అక్టోబర్ 25న జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఫలితాలు?

తెలంగాణలో అక్టోబర్ 10 న నిర్వహించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఫలితాలను ఈ నెల 25 న విడుదల చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్దమైంది. పంచాయతీ శాఖాధికారులు ఈ నెల 24 లోగా ఫలితాల జాబితాను ప్రకటించాలని పరీక్ష నిర్వహించిన జెఎన్టీయూను ఆదేశించారు. 25నే ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్టు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఫలితాలు విడుదలైన వారం రోజుల్లోనే సర్టిఫికెట్ల పరీశీలన చేయాలని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి పంచాయతీలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పనిలో చేరే విధంగా అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారని తెలుస్తోంది.

నవంబర్ లోని మొదటి రెండు వారాల్లో సర్టిఫికెట్ల పరీశీలన చేసి ఎంపికైన అభ్యర్దులకు రాజేంద్రనగర్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శాఖ కార్యాలయంలో రెండు వారాల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత కొత్త కార్యదర్శులు డిసెంబర్ 1న విధుల్లో చేరే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

తెలంగాణలోని 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు 5,62,429 మంది దరఖాస్తు చేసుకోగా పేపర్ 1 కి 4,77,637 మంది హాజరయ్యారు. పేపర్ 2 కి 4,75,012 మంది హాజరయ్యారు. జెఎన్టీయూ యూనివర్సిటి ఈ పరీక్షను నిర్వహించింది.

తెలంగాణ రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రావడంతో  కొత్త పంచాయతీలత కలిపి దాదాపు 12,751 గ్రామాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం కార్యదర్శి ఉన్న గ్రామాలను మినహాయించి మిగిలిన వాటిలో కొత్త వారిని పంచాయతీ కార్యదర్శులుగా నియమించనున్నారు.

పరీక్ష నిర్వహించిన 15 రోజుల్లోనే ఫలితాలు రాబోతున్నాయి. మరో వైపు పంచాయతీ కార్యదర్శి పరీక్ష నిర్వహించిన తీరు పై అభ్యర్దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష క్వశ్చన్ పేపర్ ను తీసుకోవడం, ఓఎంఆర్  జీరాక్స్ కాపీ  ఇవ్వకపోవడం వంటి నిబంధనపై అభ్యర్దులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్దులకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునే వీలులేదని ఖచ్చితంగా నియామకాలలో మోసం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి అభ్యర్ది ఓఎంఆర్ ఆన్సర్  షీటు డిజిటల్ కాపీ అందుబాటులో ఉంచాలని అలాగే మార్కుల వివరాలు కూడా పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

నోటిఫికేషన్ ఇచ్చిన నెలరోజుల్లోనే పరీక్ష నిర్వహించి అభ్యర్దులను అయోమయానికి గురి చేశారని పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్దులు ఆందోళన చేసినా పరిగణలోకి తీసుకోకుండా పరీక్ష  నిర్వహించారని వారు విస్మయం వ్యక్తం చేశారు.