‘మహానాయకుడు’ చంద్రబాబును అంత దెబ్బకొట్టిందా ?

ఎన్నికల ముందు మామగారి బొమ్మను చూపించి లబ్ది పొందాలన్న చంద్రబాబునాయుడు ప్లాన్ నిలువునా ముంచేసింది. ఎన్టీయార్ బయోపిక్ పేరుతో కొడుకు నందమూరి బాలకృష్ణ రెండు పార్టులుగా తీసిన సినిమాలు రెండూ అట్టర్ ఫ్లాపులవ్వటమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. బాలయ్య దెబ్బకు ఎన్టీయార్ బయోపిక్ అంటేనే జనాలు పరుగెత్తి పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారంటే ? ఉచితంగా టికెట్లను పంచి సినిమా చూడాలంటూ టిడిపి నేతలు జనాల వెంట పడుతున్నారు.

టిడిపి నేతలు కనబడుతున్నారంటే చాలు నియోజకవర్గాల్లో జనాలు పరుగో పరుగు. ఎన్టీయార్ బయోపిక్ తీశారంటే అందులో వాస్తవాలుంటాయని అనుకుంటారు. కానీ అదేం చిత్రమే తండ్రి బయోపిక్ తీసిన బాలయ్య బావగారు చంద్రబాబును హీరోగా చూపించటంతో జనాలకు మండిపోయింది. మహానాయుకుడు సినిమాలో బాలయ్య చెప్పిందేమిటంటే, బావ చంద్రబాబు లేకపోతే తండ్రి ఎన్టీయారే లేడన్నట్లుగా చూపించారు. దాంతో సినిమా చూసిన జనాలకు పిచ్చెక్కటం ఒక్కటే తక్కువట.

 చూసిన వాళ్ళు చెప్పగా విని రివ్యూలు చదివిన వాళ్ళ ద్వారా తెలుసుకుని మిగిలిన జనాలు మహనాయకుడంటేనే హడలిపోయారు. దాంతో విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారట. ఏమిటయ్యా ఆదేశాలంటే ? ప్రతీ నేత తమ నియోజకవర్గం పరిధిలోని సినిమా థియేటర్లలో టికెట్లు కొని జనాలకు పంచి సినిమా చూసేట్లు చేయాలని. అసలే ఎన్నికల కాలం కదా ? అందుకే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు వెంటనే థియోటర్ల యాజమాన్యాలతో మాట్లాడుకుని మొత్తం టికెట్లలో రోజూ సగం కొనేస్తున్నారట.

అన్ని టికెట్లను కొన్న తర్వాత నేతలు మాత్రం ఏం చేస్తారు ? అందుకనే కనిపించిన జనాలవెంట పడుతున్నారట. ఒకసారి సినిమా గురించి తెలిసిన తర్వాత టికెట్లను ఉచితంగా ఇచ్చినంత మాత్రాన చూస్తారా ఏంటి ? ఒకసారి టికెట్లను తీసుకున్న తర్వాత చూడకపోతే బాగోదు. ఎందుకంటే, టికెట్లు తీసుకున్న వాళ్ళిళ్ళకు వెళ్ళి కథ చెప్పమని అడిగినా అడుగుతారు టిడిపి నేతలు. అందుకనే టికెట్లు తీసుకోవాల్సొస్తుందని జనాలు పారిపోతున్నారట. పాపం సీన్ రివర్స్ అవటమంటే ఇదేనేమో ?