నమ్మరేంటండి బాబు… “ప్రతి ఇంటికి రూ.10 వేలు”!

ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యాలు పెద్దగా లేకుండా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు హామీల వర్షాలు కురిపిస్తాయన్న సంగతి తెలిసిందే.

అయితే.. విలువలు, విశ్వసనీయత అనేవి మెజారిటీ పార్టీల్లో నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిపోగా.. ఉన్నంతలో అక్కడక్కడా నూటికో కోటికో ఒకరిద్దరు మాత్రం కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించి హామీలిస్తుంటారు.

విచిత్రం ఏమిటంటే.. వారినే ప్రజలు తక్కువగా విశ్వసిస్తుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రత్యేకతే అనుకోవాలా.. లేక, చాలామంది ప్రజల ఆలోచనా విధానం నిజాన్ని, మాయనీ అర్ధం చేసుకోలేని విధంగా ఉంటుందని సరిపెట్టుకోవాలో అనేది అంతుపట్టని అంశం!

ఎందుకంటే… కొన్ని హామీలే కరెక్ట్ గా ఇస్తే.. అవి తమకు సరిపోవడం లేదన్నట్లుగా కొంతమంది ప్రజల ఆలోచన ఉన్నట్లు కొంతమంది నాయకులు భావిస్తున్నట్లు కనిపిస్తుంది.

రాష్ట్ర బడ్జెట్ పై అవగాహన లేకో.. ఉన్నా కూడా ఏరు దాటిన తర్వాత సంగతి కదా అనే వంచన ఆలోచనతోనో.. ఏదో ఒకటి తగులుతుందిలే అని వందల హామీల వర్షాలు కురిపించేస్తుంటే… వాటిని నమ్మే జనాలు ఈ మధ్య పెరిగిపోతున్నారు.

మిగిలినవాటి సంగతి పక్కన పెడితే.. తమకు అర్హత ఉన్న పథకం కచ్చితంగా అమలవుతుందనే ఆలోచనతో ఓట్లు వేసేస్తున్న పరిస్థితి!

ఈ క్రమంలో రోజు రోజుకీ కొత్త కొత్త ఉచిత పథకాలు పుట్టిస్తున్నారు పాలకులు. ఉచిత బియ్యం, ఉచిత కిరోసిన్, ఉచిత చక్కెర వంటి పథకాలు ఒకప్పుడు పూర్తిగా పేదలను దృష్టిలో పెట్టుకుని నాయకులు హామీలు ఇచ్చారు.. నిక్కచ్చిగా అమలు చేశారంటే దానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంది.

అయితే… అది కాస్తా రోజు రోజుకీ వికృత రూపం దాల్చుతుందేమో అనే చర్చ ఇటీవల ఓ వర్గం ఓటర్లలో, ఓ వర్గం ప్రజానికంలో తీవ్రంగా నడుస్తోంది. అలా అని ఈ చర్చ పేదలకు వ్యతిరేకం కాదు… కాకపోతే… ఎంతకాలం ఇలా చేపలు పట్టడం నేర్పకుండా నేతలు కాలం గడుపుతారనేది కీలకం.

ఒక తెలుగు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలో ఓ డైలాగ్ గుర్తుకు వస్తుంది. అదేమిటంటే… “వాడికి కడుపు నిండా అన్నం పెడితే మనమాట ఎందుకు వింటాడురా… అర్ధాకలితో మాడిస్తేనే పిలిచిన వెంటనే పలుకుతాడు” అని! మన దేశంలోని పాలకులు కూడా అలానే ఆలోచిస్తున్నారేమో..?

ప్రజలకు, పేదలకు చేపలు పట్టడం నేర్పించేస్తే.. వారు సొంతంగా ఆలోచించి ఓట్లు వేస్తారేమో.. అలా కాకుండా వారిని పేదలుగానే, ప్రభుత్వ పథకాలపై ఆధారపడితే తప్ప జీవనం సాగించలేనివారిగానే, ప్రభుత్వ ఉచిత పథకాలు లేకపోతే తమ జీవన ప్రయాణం ఇబ్బందుల్లో పడుతుందేమో అనే భయంలోనే ఉంచితేనే.. ఎన్నికలప్పుడు ఈ ఉచిత పథకాలకు, డబ్బుల పంపిణీలకు విలువ ఉంటుందని భావిస్తున్నారేమో అనిపిస్తుంటుంది.

పోనీ.. వీరి మాటలు నమ్మి తీరా ప్రజలు ఓట్లేసి గద్దె నెక్కించిన తర్వాత ఆ పథకాలు అమలు చేస్తారా అంటే… “గల్లా పెట్టి ఖాళీ” అంటూ తమదైన శైలిలో నవ్వుతూ, అదేదో జోక్ అన్నట్లుగా ప్రసంగిస్తుంటారు. ఆ ప్రసంగాలు వినడానికని వెళ్లి సభలో కూర్చున్న సామాన్యుడు మాత్రం నవ్వాలో, ఏడ్వాలో తెలియక.. రాయలేని ఎక్స్ ప్రెషన్ ఒకటి పెడతాడు.

అలవాటున్న వాడైతే ఆ సభ అయిన తర్వాత “అందుబాటు ధరల్లో దొరికే నాణ్యమైన మద్యాన్ని” తాగి మరిచిపోతాడు! మళ్లీ ఐదేళ్లకు ఎన్నికలొస్తాయి.. మళ్లీ అదే హామీతో రాజకీయ బాబులు ఎంట్రీ ఇస్తారు.. స్టోరీ రిపీట్!

అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎంత రగిలిపోయి ఉంటే.. ఇలాంటివి ఎన్ని చూసి మండిపోయి ఉంటే.. “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని – అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని – మారదు లోకం, మారదు కాలం – దేవుడు దిగిరానీ, ఎవ్వరు ఏమైపోనీ” అని కలంలోని సిరాతో తుపాకుల తూటాలు పేల్చింది.

తాజాగా దక్షిణాదిలో అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. గతంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పలు పార్టీలు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక ఎత్తేసిన చేతుల అనుభవాలు చూసిన జనాలకు సరికొత్త హామీలు ఇచ్చింది బీజేపీ! అదే… కేంద్రంలో వరుసగా మూడో దఫా అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి!

ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం…

ప్రతి కుటుంబానికి ఒకేసారి రూ.10,000

పొంగల్, దీపావళి, తమిళ కొత్త సంవత్సరం రోజుల్లో ఒక్కో ఉచిత ఎల్పీజీ సిలిండర్

ఈ-స్కూటర్ల కొనుగోలుపై రూ.25,000 రాయితీ

ప్రతి మహిళకు రూ.8,000 విలువైన గృహోపకరణాల కొనుగోలు కూపన్‌

జల్లికట్టు ఎద్దులను పెంచే వారికి నెలకు రూ.2,000 సాయం

తిరుపరంకుండ్రంలో కార్తీక దీపం వెలిగించే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు చర్యలు

ఇవి దేశాన్ని వరుసగా మూడోసారి భారీ ప్రజా మద్దతుతో పాలిస్తోన్న బీజేపీ ఇచ్చిన హామీలలో మచ్చుకు కొన్ని! ఇక పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ డబ్బుల పంపిణీ టాపిక్ కనిపించింది. ఇందులో భాగంగా… నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు, మహిళలకు ప్రతినెలా రూ.3వేలు ఆర్థిక సాయం అని ప్రకటించింది బీజేపీ!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇప్పటికే వీటిలో కొన్ని హామీలు ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమిలో బీజేపీ కూడా ఉంది. అక్కడ ప్రభుత్వంలో బీజేపీకి చెందిన మంత్రులు ఉన్నారు. మోడీ ప్రసంగాలు ఉన్నాయి, అమిత్ షా ప్రచారాలు ఉన్నాయి!

మరి ఆ నిరుద్యోగ భృతి, మహిళలకు నెల నెలా ఆర్థిక సాయాలు ఇక్కడ అందడం లేదు ఎందుకు..? ఇక్కడ ఇవ్వని వారు.. అక్కడ మాత్రం ఎలా ఇస్తారు..? ఇక్కడ బీజేపీ మాత్రమే టాపిక్ ఎందుకంటే… అది జాతీయ పార్టీ, చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ.. దేశాన్ని పాలిస్తున్న పార్టీ గనుక! అలా అని.. ఇక్కడ బీజేపీ నేతలది తప్పు అనడం లేదు… కచ్చితంగా ఈ తరహా హామీలను నమ్మిన, నమ్ముతున్న జనాలదేనేమో తప్పు!!

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలుచేయలేదు. విచిత్రంగా 2024లోనూ అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మళ్లీ దాని ఊసెత్తడంలేదు!

అందుకే అంటారు… ఎన్నికల ప్రచార సమయంలో ‘నాలుకకు నరం ఉండదు’ కానీ… ఆ హామీలు నెరవేర్చే విషయంలో మాత్రం ‘చేతికి ఎముక ఉంటుంది’.. అది వంగదు, లొంగదు, ఆ హామీ ఫలితం ప్రజలకు అందదు అని! కాకపోతే ఆ ప్రచారాలను, హామీలను నమ్మే ప్రజలే కాస్త తమ తమ మస్తిష్కాలకు పని చెప్పాలి!

నోట్: ‘నాలుకకు నరం ఉండదు’ అనేది కేవలం ఒక సామెత మాత్రమే… నిజానికి నాలుకలో నరాలు ఉంటాయి కాకపోతే ఎముకే ఉండదు!