ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చే హామీలకు, చెప్పే మాటలకు, చేసే ఊకదంపుడు ఉపన్యాసాలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరించే ప్రవర్తనకు ఏమాత్రం పొంతన ఉండదనే సంగతి చాలామందికి తెలిసిందే. తాజాగా ఏపీలో జరుగుతున్న పలు ఘోరాలు.. దానిపై సీఎం చంద్రబాబు చెబుతోన్న మాటలు.. మరోవైపు ఎన్నికలకు ముందు పవన్ చేసిన వ్యాఖ్యలు.. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఏపీలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. మోడీ స్టైల్లో చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ కొలువు దీరినప్పటి నుంచీ మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల సంగతి చెప్పే పని లేదు!
పసి పిల్లల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్న మహిళల వరకూ… అటు ఆకతాయిల దగ్గర నుంచి ఇటు ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం చిల్లర పనులకు, మోసాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేపథ్యంలో… ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు, మరెంత మంది విషయంలో చూసీచూడనట్లు పోయారు అనేది కీలకంగా మారింది.
బాధితుల పేర్లు.. అందుకు కారకులైన పలువురు నిందితుల పేర్లు.. ఆ నిందితుల్లో రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వారి పేర్ల ప్రస్థావన సంగతి కాసేపు పక్కన పెడితే… సుమారు గత రెండేళ్లుగా ఏపీలో బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలు – ఘోరాల సంగతి చెప్పే పనిలేదు!
ఒకసారి పాత పత్రికలు, యూట్యూబ్ లో సెర్చ్ లోకి వెళ్తే… వరుసగా దర్శనమిస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఏ ఘటన జరిగినా సీఎం చంద్రబాబు ఇచ్చే స్టేట్ మెంట్ కూడా దాదాపు ఒకటే!
వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి ఓ ప్రేమోన్మాది కిరాతకంగా చంపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తనదైన శైలిలో ఎప్పటిలాగానే సీరియస్ అయ్యారు. మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లో నిందితుల్ని విడిచిపెట్టమని.. ఆడబిడ్డల భద్రత విషయం రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు.
సరిగ్గా చంద్రబాబు స్టేట్ మెంట్ వచ్చిన కొన్ని గంటల తర్వాత పశ్చిమ బెంగాల్ లో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి బలమైన స్టేట్ మెంట్స్ వచ్చాయి! ఇందులో భాగంగా… బెంగాల్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే శాంతి భద్రతలు సాధ్యమని చెప్పిన మోడీ… బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు! దీంతో… మరి ఇప్పటికే డబుల్ ఇంజిన్ సర్కార్ లు ఉన్న రాష్ట్రాల్లోని మహిళల భద్రత సంగతేమనే ప్రశ్నలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి!
ఏది ఏమైనా… ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మోడీ ఇచ్చిన భరోసా, తాజాగా కడప జిల్లాలో జరిగిన ఘటనపై చంద్రబాబు ఇచ్చిన హెచ్చరికలు బాగానే ఉన్నాయి కానీ… చర్యల విషయంలోనే నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
పైగా… అధికారాన్ని అడ్డం పెట్టుకుని పలువురు కూటమి నేతలు మహిళలపై వేధింపులకు పాల్పడుతుంటే, బహిరంగంగా మహిళలపై భౌతిక దాడులకు తెగిస్తుంటే.. వారిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేకపోవడం అనేది… అత్యంత దారుణమైన విషయమని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు హెచ్చరికలు, నరేంద్ర మోడీ భరోసా మాటలను… నేతి బీరకాయలో నెయ్యిలా ప్రజలు చూస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు! ఈ పద్ధతులు మారాలని, కోరుకుంటున్నారు!! మాటల్లో కనిపించే తీవ్రత, చేతల్లో ఎంతోకొంతైనా కనిపించాలని ఆశిస్తున్నారు.
