Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం మరోసారి చారిత్రక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. భూమి యజమాన్యం లేకుండా ఇతరుల భూముల్లో సేద్యం చేస్తున్న కౌలు రైతులకు కూడా ప్రత్యక్ష ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అనేక పథకాలు యజమాన రైతులకే పరిమితమయ్యేవి. ఇకపై ‘అన్నదాత సుఖీభవ’ అనే పథకం కౌలు రైతులకు కొత్త ఊరటనివ్వనుంది.
ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 20,000 అందించనున్నారు. ఇందులో కేంద్రం నుండి వచ్చే రూ. 6,000 (పీఎం కిసాన్)తో పాటు రాష్ట్రం నుండి అదనంగా రూ. 14,000 ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం సొమ్మును మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇది కేవలం కౌలు రైతులకే కాకుండా, అటవీ భూములపై హక్కు పత్రాలున్న ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా వర్తిస్తుంది.
అర్హుల ఎంపిక కోసం అధికారులు మే 20వ తేదీ వరకు పూర్తిగా గ్రామస్థాయిలో లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంలో అర్హుల జాబితా రూపొందించనున్నారు. దీనిలో కుటుంబాన్ని యూనిట్గా పరిగణించి, వివాహం అయిన పిల్లల కుటుంబాలను వేరుగా గుర్తించనున్నారు. సగటు రైతుకి ఇది గొప్ప ఊరటగా మారుతోంది. అయితే ఈ పథకం నుంచి పన్ను చెల్లించే వృత్తి నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత పదవులు చేపట్టినవారు తప్పించబడ్డారు. దీని వల్ల నిజంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం కనిపిస్తోంది.