“గ్లాస్‌ పవన్‌ ది.. ఛాయ్‌ చంద్రబాబుది”!

పవన్ కల్యాణ్ ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చేపట్టిన జనసేన వారాహి యాత్ర ముగిసి రెండు రోజులు అవుతున్నా… ఆ సభల్లోని పవన్ ప్రసంగాల తాలూకు ప్రతివిమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అంబటి రాంబాబు తన కోటా పూర్తిచేయగా.. తాజాగా వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ మైకందుకున్నారు. పవన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును.. పవన్ చేస్తున్న విమర్శలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. లాజిక్కులు లాగుతూ ప్రజలకు పవన్ పరిస్థితిని తెలియజెప్పే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఫలితంగా పవన్ జనసేన.. చంద్రబాబు టీడీపీకి స్టెపిన్ అనే సంకేతాలు ఇస్తున్నారు. ప్రజల్లో ఆ మేరకు ఉదాహరణలు చూపిస్తూ వారి వాదనను, ప్రజల అనుమానాలను బలపరుస్తూ ముందూ పోతున్నారు.

ఇందులో భాగంగా తాజాగా మైకులముందుకు వచ్చిన నందిగాం సురేష్… చంద్రబాబు ప్రస్తావనకొచ్చేసరికల్లా పవన్‌ కళ్యాణ్‌ తన బానిసత్వాన్ని సమర్ధంగా నిరూపించుకుంటున్నాడని విమర్శించారు. ఇదే స్మయంలో… బాబుకు బానిసగా పనిచేసే విషయంలో ఎక్కడా అలసటనేది లేకుండా.. చురుగ్గా, సమర్ధవంతంగా పనిచేస్తున్న వ్యక్తిగా పవన్‌ కళ్యాణ్‌ ను చెప్పుకోవచ్చని వ్యంగాస్త్రాలు సంధించారు.

ఇక గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక.. ఇల రెండుచోట్లా ఓడిపోవడానికి చంద్రబాబే కారణం అని సురేష్ కొత్త లాజిక్ తీశారు. ఆ రెండు చోట్లా పోటీచేస్తే ఏదో ఒక చోట గెలిచే ఛాన్స్ ఉంటుందని చంద్రబాబే.. పవన్ కు సూచించారని.. ఫలితంగా పవన్ ఓటమికి కారణమయ్యారని నందిగాం సురేష్ చెప్పారు.

ఇదే క్రమంలో చంద్రబాబు – పవన్ ల బంధం.. బాబు దగ్గర పవన్ బానిసత్వం.. పవన్ ను ఆడిస్తున్న బాబు నాయకత్వం అనేస్థాయిలో మరింతగా స్పందించిన నందిగాం సురేష్… పవన్‌ కళ్యాణ్‌ గ్లాసులో టీ పోసింది చంద్రబాబు అని భీమవరం, గాజువాకలో ఏ ఒక్క చిన్నపిల్లోడ్ని అడిగినా చెబుతాడని అన్నారు. ఫలితంగా గ్లాసు మాత్రమే పవన్ కల్యాణ్ ది అని.. అందులో ఛాయ్ మాత్రం చంద్రబాబుదే అని నందిగాం సురేష్ చెప్పారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో… రేపటి ఎన్నికల్లో ప్రజలు పవన్ గ్లాసులో టీ పోసినా… అది తాగేది కూడా చంద్రబాబే అంటూ కామెంట్లు పెడుతుండటం గమనార్హం.