అన్నీ తీసుకుని దెబ్బ కొట్టారట

చంద్రబాబునాయుడు బాధ ఇప్పట్లో తీరేట్లు కనబడటం లేదు. ఫలితాల తర్వాత వంతుల వారీగా తనను కలిసి పార్టీ శ్రేణులు చేస్తున్న ఓదార్పు యాత్ర వల్ల చంద్రబాబు బాధ మరింతగా పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. నిజానికి ఎక్కడి నుండో వచ్చి కార్యకర్తలు చంద్రబాబును ఓదార్చాల్సిన అవసరం లేదు. కానీ నేతలే ఈ అరేంజ్మెంట్స్ చేస్తుండటంతో ఓదార్పు యాత్ర ఓ ప్రహసనంలాగ సాగుతోంది.

అదే నేపధ్యంలో ఓ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుందామని చంద్రబాబు హైదరాబాద్ కు వచ్చారు. ఆ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడుతూ ఐదేళ్ళు అన్నీ సంక్షేమ ఫలాలు తీసుకుని కూడా మనలను దెబ్బ కొట్టారంటూ తెగ బాధపడిపోయారు. తమ ప్రభుత్వంపై జనాల్లో ఎందుకంత వ్యతిరేకత వచ్చిందో ఇప్పటికీ అర్ధం కావటం లేదంటూ బాధపడిన చంద్రబాబును పార్టీ నేతలే ఓదార్చారు.

ఉద్యోగులకు, ప్రజలకు అడిగినవి, అడగనవి కూడా ఇచ్చామని అన్నీ తీసుకుని టిడిపిని ఓడించాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధం కావటం లేదన్నారు. ప్రభుత్వంపై ఈ స్ధాయిలో వ్యతిరేకత ఉంటుందని ఊహించలేదని కూడా చంద్రబాబు పాపం బోల్డు బాధపడిపోయారు.

సరే అయ్యిందేదో అయిపోయందని అనుకున్నట్లున్నారు చంద్రబాబు. అందుకనే తెలంగాణాలో పార్టి బలోపేతానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. అందుకనే ఇక నుండి వారానికి రెండు రోజులు తెలంగాణాలో పార్టీని బలోపేతానికి కేటాయిస్తారట. సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా చేయాలన్నారు. కెసియార్ మీద జనాల్లో వ్యతిరేకత వచ్చేస్తోందని సమావేశంలో తీర్మానించుకున్నారు. కాబట్టి ఇకనుండి టిడిపి కెసియార్ కు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలుపెడుతుందేమో చూడాలి.