బయటపడిన చంద్రబాబు బలహీనత

విజయవాడలో తెలుగుదేశంపార్టీ నేతల వివాదం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు వస్తున్నాయి. చంద్రబాబునాయుడు బలహీనుడు అవటం వల్లే ఇద్దరు నేతలు పరస్పర ఆరోపణలతో పార్టీ పరువును బెంజిసర్కిల్లో కలిపేశారు. పార్టీలో ఎవరిని కూడా అదుపు చేసేంత సీన్ చంద్రబాబుకు మొదటినుండి లేదు. హద్దు దాటితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బెదిరించటాలే తప్ప ఎవరి మీదా చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. తాజాగా ఎంపి, ఎంఎల్సీ వివాదం చూసినా అదే అర్ధమవుతుంది.

ఎంఎల్సీ బుద్ధా వెంకన్నకు విజయవాడ ఎంపి కేశినేనికి మధ్య ఆదివారం ఉదయం మొదలైన ట్వీట్ల యుద్ధం సోమవారం ఉదయానికి పీక్ కు చేరుకుంది. అంటే దాదాపు 24 గంటలపాటు జరిగిన ట్వీట్ల యుద్ధంలో ఒకరిపై మరొకరు భయంకరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.

బుద్దాను బ్రోకరని, కొబ్బరి బోండాల దొంగని, కాల్ మనీ సెక్స్ రాకెట్ లో సూత్రదారుడంటూ ఎంపి ఆరోపించారు. వెంటనే ఎంపిని ఉద్దేశించి దొంగ పర్మిట్లతో బస్సులు తిప్పారని, దొంర రశీదులతో అక్రమంగా సంపాదించారని బుద్దా ప్రత్యారోపణలు చేశారు. అంటే ఇద్దరు ఒకరి బండారాన్ని మరొకరు బయట పెట్టుకున్నారు.

ఇక్కడ వీళ్ళిద్దరూ మరచిపోయిన విషయం ఒకటుంది. ఒకళ్ళ పరువు మరొకరు తీసుకోవటం కాదు. ఇద్దరూ కలిసి పార్టీ పరువును రోడ్డున పడేశారు. పార్టీ పరువు రోడ్డున పడి గబ్బు పట్టిన తర్వాత తీరిగ్గా చంద్రబాబు ఇద్దరిని తనను కలవమని చంద్రబాబు నుండి కబురు రావటం గమనార్హం. దీన్ని బట్టే తెలిసిపోతోంది చంద్రబాబు ఎంతటి బలహీనుడైపోయాడో.