భోరుమంటున్న తమ్ముళ్ళు..ఓదారుస్తున్న చంద్రబాబు

తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోవటాన్ని తెలుగుదేశంపార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికలన్నాక గెలుపోటములు చాలా సహజం. కానీ తమ్ముళ్ళు మాత్రం ఎందుకో తమ ప్రాణాలే పోతున్నంతగా బాధపడిపోతున్నారు.  ఒకళ్ళని మరొకళ్ళు పట్టుకుని మరీ ఓదార్చుకుంటున్నారు.

నియోజకవర్గాల్లో అంటే నేతలు పరస్పరం ఓదార్చుకుంటున్నారు బాగానే ఉంది. మళ్ళీ అందరూ కలిసి చంద్రబాబునాయుడు దగ్గరకు వచ్చి మరీ భోరు భోరు మంటున్నారు. దాంతో తన దగ్గరకు వస్తున్న వాళ్ళని ఓదార్చటం చంద్రబాబుకు పెద్ద పనైపోయింది.  ఒకవైపు పుత్రరత్నం నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయినందుకు చంద్రబాబే బాధపడుతుంటే మధ్యలో నేతల గొడవేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

మంగళగిరి నుండి టిడిపి నేతలు వచ్చి చంద్రబాబును కలిశారు. నియోజకవర్గంలో లోకేష్ ఓటమి గురించి వివరిస్తు ఒక్కసారిగా భోరుమనేశారు. దాంతో చంద్రబాబు తన కుర్చీలో నుండి లేచొచ్చి మరీ ఓ నేతను ఓదార్చాల్సొచ్చింది. మంగళగిరి నుండి వచ్చిన నేతలను  చంద్రబాబు ఓదార్చారే కానీ లోకేష్ మాత్రం ఎక్కడా కనబడలేదు. అదే లోకేష్ స్పెషాలిటి.