పొత్తు పాలిటిక్స్… సోషల్ మీడియా స్టార్ కి కొత్త కష్టం!

నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు గురించి మాగ్జిమం ఎవరికీ పరిచయం అవసరం లేదనే చెప్పుకోవాలి. ప్రధానంగా నరసాపురం ఎంపీగా జగన్ వేవ్ లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన… అనంతరం ఆ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా మారిన సంగతి తెలిసిందే! ప్రతిపక్షాలు సైతం షాకయ్యే స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై లాజికల్ విమర్శలు చేస్తుండేవారు. ఆ సమయంలో ఒకవర్గం మీడియా నుంచి భారీ మద్దతు లభించింది.

ఇక సోషల్ మీడియాలోని పొలిటికల్ గ్రూప్స్ లో రఘురామకృష్ణంరాజు రెగ్యులర్ గా ట్రెండింగ్ లో ఉంటుండేవారు! దీంతో… ఏపీ పాలిటిక్స్ లో “ట్రిపుల్ ఆర్”గా ముద్దుపేరు కూడా సంపాదించుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో నరసాపురం టిక్కెట్ ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ నుంచి బరిలోకి దిగడానికి రెడీగా ఉన్నారాయన! అటు బీజేపీ, ఇటు టీడీపీ, అటు జనసేన.. మూడు పార్టీలతోనూ మాంచి సాన్నిహిత్యం సంపాధించుకున్న ఆయనకు ఇప్పుడు ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వబోతుందనేది ఆసక్తిగా మారింది.

అవును… ఏపీలో టీడీపీ – జనసేన కూటమితో బీజేపీ చేరితే కచ్చితంగా బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్ పైనే ట్రిపుల్ ఆర్ పోటీ చేసే అవకాశం ఉందనేది ఆల్ మోస్ట్ కన్ ఫాం అయిన విషయం! ఒక వేళ పొత్తులో బీజేపీ జాయిన్ అవ్వకపోతే…? అప్పుడు కూడా బీజేపీ టిక్కెట్ రఘురామరాజుకి దగ్గుతుంది కానీ… అప్పుడు ఆయన ఇటు వైసీపీతో పాటు, అటు టీడీపీ – జనసేన కూటమి నేతను కూడా ఎదుర్కోవాలి. ఆ సమస్య ఎందుకు..? పొత్తు లేకపోతే టీడీపీలోనో, జనసేనలోనో చేరిపోతే బెటర్ కదా..?

నిన్నటివరకూ ఈ ఆప్షన్ ట్రిపుల్ ఆర్ కి ఉండేది కానీ.. ఇప్పుడు ఆ ఆప్షన్ మూసుకుపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. కారణం… నాగబాబు అని తెలుస్తుంది! ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నాగబాబు.. అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారని కథనాలొచ్చాయి. ఆయన ఆ సీటే ఫిక్సయ్యి.. స్థానికంగా ఇల్లు కూడా తీసుకుని.. లోకల్ గానే ఉంటానని చెబుతూ వర్క్ స్టార్ట్ చేసుకున్నారు.

అయితే… టీడీపీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత.. అనకాపల్లిలో సామాజిక సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని.. అక్కడ నాగబాబు పోటీ చేయడానికి అనువుగా పరిస్థితులు లేవనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో… మరి నాగబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? ఈసారికి లైట్ తీసుకుంటారా..? అనే చర్చ తెరపైకి వచింది. ఈ సమయంలో… నాగబాబు ఈ ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

గత ఎన్నికల్లో కూడా నాగబాబు.. నరసాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో నాగబాబుకు 2,50,289 ఓట్లు దక్కాయి. టీడీపీ అభ్యర్థికి 4,15,685 దక్కాయి. ఇక ఆ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థి ట్రిపుల్ ఆర్ కు 4,47,594 ఓలు వచ్చాయి. అంటే… మెజారిటీ 31,909 ఓట్లు అన్నమాట. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటున్న జనసేన అధినాయకత్వం… ఈ ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి గనుక… నరసాపురంలో నాగబాబు గెలుపు కన్ ఫాంగా అని అంటుందని తెలుస్తుంది.

దీంతో… కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇబ్బందులు తెచ్చుకునే కంటే… గత ఎన్నికల్లో అలవాటైన నరసాపురం నుంచే బరిలోకి దిగితే… టీడీపీ ఓట్లు కూడా ఉంటాయి కాబట్టి… పార్లమెంట్ కు వెళ్లొచ్చని నాగబాబు కూడా భావిస్తున్నారని తెలుస్తుంది. దీంతో… నాగబాబు అటు తిరిగి ఇటు తిరిగి రఘురామకృష్ణంరాజుకి స్ట్రోక్ ఇచ్చేలా ఉంది పరిస్థితి అని అంటున్నారు పరిశీలకులు. అదే జరిగితే… ట్రిపుల్ ఆర్ పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటి.. నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.