మరీ ఇంత రివేంజా ట్రిపుల్ ఆర్?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆర్ – 5 జోన్ ఇళ్ల స్థలాల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇటు పేదలకు కూడా రాజధాని ప్రాంతంలో నివాసానికి అవకాశమివ్వాలని.. తద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా… వాటన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొని, తొలగించుకుని ఇప్పుడు పేదలకు ఒక సెంటు భూమిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఈ విషయంలో తన అక్కసును బహిరంగంగా వెల్లగక్కారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు!

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ భావిస్తుంటే… దాన్ని అడ్డుకోవడానికి ఎన్నేసి ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు పేదల శత్రువులు! ఇప్పటికే కోర్టుల ద్వారా పేదలకు భూమి ఇచ్చే విషయాన్ని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన టీడీపీ నేతల సరసన ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్. కూడా చేరిపోయారు. ఇందులో భాగంగా కేంద్రానికి లేఖ రాశారు.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఆర్ – 5 జోన్ ఇళ్లపై కేంద్రానికి లేఖ రాశారు. ఆర్- 5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి సాయం చేయవద్దంటూ కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పూరికి విజ్జప్తి చేశారు. ఆర్-5 జోన్లో 47,017 ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పంపింది. అయితే ఏపీ పంపిన ఆ ప్రతిపాదనలపై స్పందించవద్దని కేంద్రానికి ఎంపీ రఘురామ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్.ఆర్.ఆర్. పై ఆన్ లైన వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు!

రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రానికి లేఖలు రాసే నేతలు ఉంటారు కానీ… పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపైనా, ఇళ్ల నిర్మాణం పైనా సహాయం చేయొద్దని లేఖరు రాసిన నేతగా రఘురామ కృష్ణంరాజు చరిత్రలో నిలిచిపోతారంటూ ఫైరవుతున్నారు నెటిజన్లు. పనిగట్టుకుని పేద ప్రజలపై ఇంత కక్ష పెంచుకోవడం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు.ఇళ్లు లేని నిరుపేదలపై ఇలా పనిగట్టుకుని విషం చిమ్మడం తప్పే కాదు, పాపం కూడా అని హెచ్చరిస్తున్నారు. జగన్ పై రివేంజ్ తీర్చుకుంటున్నామనే భ్రమలో… పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నామన్న విషయం ఆర్.ఆర్.ఆర్. స్పృహకు రావడం లేదని దుయ్యబడుతున్నారు!

కాగా… అమరావతి ప్రాంతంలో పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలను సమాదుల దొడ్డిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లపై వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే!