రోజా హాట్ హాట్ కామెంట్స్ , ఎవరిని టార్గెట్ చేసిందో తెలుసా ?

వైసీపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న నేతల్లో ఒకరు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. అలాగే ఏపీలో ఫైర్ బ్రాండ్ నేత .. విపక్షాల పై విమర్శలు చేయడంలో మంచి దిట్ట. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన, ఆ తర్వాత రాజకీయాల్లో రాణించిన మహిళలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. టీడీపీ తరఫున రాజకీయాల్లో అడుగు పెట్టిన రోజా తొలినాళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. టీడీపీ తరఫున పోటీ చేసిన రెండు సార్లు ఓడిపోయారు. తర్వాత టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అప్పటి సీఎం వైఎస్ ఆర్ని కలవగా.. కొద్దిరోజులకే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందారు.

ఈ తరుణంలో రాజకీయంగా రోజా పై ఐరెన్ లెగ్ ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత సీఎం వైఎస్ స్థాపించిన వైసీపీలో మొదట్లోనే చేరి ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున చిత్తూరు జిల్లా నగరి నుంచి ఎమ్మెల్యేగా రోజా ఎన్నికైనా, పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. అప్పుడు కూడా రోజాను టార్గెట్ చేస్తూ ఐరెన్ లెగ్ అంటూ ఎద్దేవా చేశారు. అయితే ప్రతిపక్ష పాత్రలో గత టీడీపీ ప్రభుత్వాన్ని వీలైనప్పుడల్లా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ తరుణంలో 2019లో వైసీపీ అఖండ మెజారిటీతో ఏపీలో అధికారంలోకి వచ్చింది. రోజా వరుసగా రెండో సారి నగరి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో రాణించిన అతి కొద్ది మంది సినిమా స్టార్స్‌ లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాగే రాజకీయాల్లో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్నారు.

తమిళనాడు రాజధాని చెన్నై లో బుధవారం సౌతిండియా సినీ, టీవీ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భర్త సెల్వమణితో కలిసి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. ఈ సంరద్భంగా సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేసుకున్నారు. నల్లగా ఉన్నావు.. సినిమాల్లో హీరోయిన్‌గా ఎలా రాణిస్తావు … అంటూ తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో అందరూ కామెంట్ చేసేవారని తెలిపారు. అయితే మేకప్‌ మెన్స్ తనకు కాస్త రంగు వేసి చాలా అందంగా చూపించారని ఆమె గుర్తు చేసుకున్నారు. మేకప్ ఆర్టిస్టుల కారణంగానే తాను అందంగా కనిపించానని చెప్పారు. తమిళ సినీ పరిశ్రమ తనకు పుట్టినిల్లు వంటిదని ఎమ్మెల్యే రోజా తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పారు. అయితే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను తలచుకుంటే ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుందని తెలిపారు. ఎంజీఆర్, జయలలిత చెప్పిన మంచి విషయాలు విని తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. సినీ ప్రముఖులతో ఎలా నడుచుకోవాలో జయలలిత తనకు చెప్పారని వివరించారు.