మిథున్ రెడ్డిని కెలికిన లోకేష్… తెరపైకి డిఎన్ఏ ఇష్యూ!

టీడీపీ యువకిశోరం నారా లోకేష్ “యువగళం” పేరుతో చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం చిత్తురు జిల్లాలో కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచడం సంగతి పక్కపెట్టి.. తన డిఎన్ఏ ని నిరూపించుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశాయి. అవును… తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటారో.. లేక, సవాళ్ చేయడమంటే.. ఆ రోజు టీవీలో చూపించడానికి – మరుసటి రోజు పత్రికల్లో అచ్చువేయడానికి ఉపయోగపడే ఒక స్టేట్ మెంటే తప్ప, నిజంగా ఆ ఛాలెంజ్ పై నిలబడటానికి కాదని బలంగా నమ్ముతారో ఏమో కానీ… తెగ ఛాలెంజ్ లు చేసేస్తున్నారు లోకేష్! ఇందులో భాగంగా మిథున్ రెడ్డికి కెలికారు!

అవును… ప్రస్తుతం చిత్తురు జిల్లా పాదయాత్రలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు చినబాబు లోకేష్. చిత్తూరు జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారని, అందుకే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయిందని నారా లోకేష్ విమర్శించారు. ఆఫ్రికాలో ఉన్న వ్యాపారాలను చూసుకునేందుకే మిథున్ రెడ్డికి సమయం సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. “దమ్ముంటే చిత్తూరు అభివృద్ధిపై చర్చించేందుకు తంబళ్లపల్లెకు రా!” అంటూ మిథున్ రెడ్డికి సవాల్ విసిరారు! దీంతో మైకుల ముందుకు వచ్చారు మిథున్ రెడ్డి!

“ఈ నెల 12న తంబళ్లపల్లెలోనే ఉంటాను.. చర్చకు వస్తాను.. ప్లేస్ ఎక్కడో నువ్వే చెప్పు లోకేష్” అంటూ మెల్లగా మొదలుపెట్టిన మిథున్ రెడ్డి… నీ పాదయాత్రకు జనం బ్రహ్మరధం పడుతున్నారని అంటున్నారు కదా… నిజంగా నీలో చిత్తురు జిల్లా డీ.ఎన్.ఏ ఉంటే.. నీలో ఒక్క చుక్క అయినా చిత్తురు జిల్లా రక్తం ఉంటే.. చిత్తురు జిల్లా మొత్తం మీద ఏ సీటైనా ఎంచుకో.. నీపై పోటీకి నేను సిద్ధం.. నువ్వు నిజంగా చిత్తురు జిల్లా బిడ్డైతే.. మీనాన్న నిజంగా చిత్తురూ జిల్లా – దీఎనే ఉంటే… పోటీకి నేను రెడీ. అలా కాకుండా… నేను చిత్తురు జిల్లాలో పోటీచేయలేను అంటే నిజంగా నువ్వు భయపడిపోయినట్లు భావించి.. ఇప్పటివరకూ నీవు చేసిన విమర్శలు అబద్దాలని ఒప్పుకున్నట్లు భావించి.. వదిలేస్తాను” అంటూ ముగించారు.

మరి ఈ ప్రతిసవాల్ పై లోకేష్ స్పందిస్తారా.. లేక, మిథున్ రెడ్డితో పెట్టుకోవడం ఎందుకని సైలంట్ అయిపోతారా అన్నది వేచి చూడాలి!

YouTube video player