వైసీపీని ముంచేస్తోన్న మంత్రి రోజా.!

మెగాస్టార్ చిరంజీవి గురించి వైసీపీ ఎంత ఎక్కువ మాట్లాడితే, ఆ పార్టీకి అంత నష్టం. కానీ, మెగాస్టార్ చిరంజీవి మీద ప్రేమ ప్రదర్శిస్తూ, పవన్ కళ్యాణ్‌ని విమర్శించడం… అనే అర్థం పర్థం లేని వ్యూహంతో వైసీపీ, తన స్థాయిని నానాటికీ దిగజార్చుకుంటోంది.

‘చిరంజీవి చాలా చాలా గొప్పవారు..’ అంటున్నారు వైసీపీ నేతలు. గతంలో పేర్ని నాని, ప్రస్తుతం రోజా.. చిరంజీవి మీద అమితమైన అభిమానాన్ని ప్రదర్శిస్తోంటే, అంతా నవ్విపోతున్నారు. రాజకీయం ఎవర్నయినా, ఎలాగైనా మార్చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.

నిజానికి, చిరంజీవి రాజకీయాల్లో లేరు. ఆయనసలు ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నదే చాలా చాలా అరుదుగా. మొన్నామధ్య, ‘నేనూ వైజాగ్‌లో ఓ ఇల్లు కొనుక్కుంటా..’ అని చిరంజీవి చెప్పారు. కానీ, ఆ దిశగా ఆయన అడుగులేయలేదు, సరే, అది ఆయన వ్యక్తిగత విషయం.

చిరంజీవిని వివాదాల్లోకి లాగి, తద్వారా జనసేనను దెబ్బ తీయాలని వైసీపీ అనుకుంటే, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటుండదు. మొన్నీమధ్యనే ‘భోళాశంకర్’ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని చిరంజీవి ఇమిటేట్ చేసినట్లుగా చెబుతూ, ఓ వీడియోను లీక్ చేశారాయన.

తమ్ముడి పట్ల ఎంతటి అభిమానం అన్నయ్యకి వుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఇవన్నీ తెలుసుకోలేనంత అమాయకురాలైతే కాదు రోజా. మరి, ఆమె ఎందుకు చిరంజీవిని వివాదాల్లోకి లాగుతున్నట్టు.? పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాలంటే, నేరుగానే చేసెయ్యొచ్చు.

వ్యవహారం ఇప్పుడెలా మారిందంటే, అనధికారికంగా జనసేన పార్టీకి గౌరవాధ్యక్షుడు చిరంజీవే.. అనేంతగా. జనసైనికులు అలా ఫిక్సయిపోతున్నారు. ఇది వైసీపీ చేసిన వ్యూహాత్మక తప్పిదం తాలూకు ఫలితం.!