పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకున్నాయంటూ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కీలక వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, డయాఫ్రం వాల్ పనులు ఇప్పుడు వేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పాలనలో ఈ నిర్మాణం పూర్తిగా అడ్డంకులకు లోనైందని, ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల దిశగా నడుస్తోందన్నారు.
ప్రస్తుతం వరకు 202 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తైందని మంత్రి చెప్పారు. జనవరి 18న రూ.990 కోట్ల వ్యయంతో కొత్తగా పనులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లు పనిలో ఉన్నాయని, మూడవ కట్టర్ ఏప్రిల్ 30 నాటికి రంగంలోకి దిగుతుందని వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో ఎగువ కాపర్ డ్యామ్ బలోపేతానికి బట్రస్ డ్యామ్ మేలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
డయాఫ్రం వాల్ పూర్తయ్యేలోగా గ్యాప్-1 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, గ్యాప్-2 వద్ద నవంబర్ 30నాటికి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు, 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా అన్ని శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. గోదావరి పుష్కరాలు 2027లో ఉన్నందున, జూన్ కల్లా పనులు పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు.
లెఫ్ట్ కెనాల్ పనులు గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిలిచిపోయాయని, ఇప్పుడు మాత్రం రూ.1200 కోట్లతో టెండర్లు పిలిచి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు అందించడమే కాకుండా, తాగునీటి అవసరాలను కూడా తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.