వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే బీజేపీ సర్కార్ ని పూర్తిగా నమ్మే ధైర్యం చేయలేమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అయితే… ప్రస్తుతానికి మాత్రం ఆ కార్యక్రమం ఆగిందని మాత్రం తెలుస్తుంది. ఈ విషయాలపై తాజాగా కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

అవును… విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర బీజేపీ సర్కార్ వెనకడుగు వేసిందా? అంటే… కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమనే అనిపిస్తోంది. విశాఖకు వచ్చిన కేంద్రమంత్రి ఫగన్ సింగ్… స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో, స్టీల్ ప్లాంట్ ‏కు చెందిన ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదని మంత్రి తెలిపారు. ముందు తాము “రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్” ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని.. అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థం మేరకు పనిచేయడం మీద దృష్టిపెడతున్నామని అన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ వేలంలో పాల్గొనడంపై స్పందించిన ఆయన… అదంతా కేసీఆర్ వేస్తున్న ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని ఆరోపించారు.

అయితే ఫగ్గన్ సింగ్ చెప్పినట్లు… ప్రైవేటీకరణకు ముందు ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను బలోపేతంపై దృష్టి పెడతామని అంటే… ప్రైవేటీకరణ పై కేంద్రం పూర్తిగా వెనక్కి తగ్గినట్లు నమ్మకం కలగడం లేదని.. కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసి, స్టీల్ ప్లాంట్ కు నిధులు, గనులు కేటాయిస్తే అప్పుడు కేంద్రాన్ని నమ్ముతామని కార్మిక నాయకులు చెప్తున్నారు.