పవన్ పంది మీద ఎక్కాడు.. 420లా తయారయ్యాడు!

ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. రోజు రోజుకీ ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కి పోతుంది. మరిముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ నేతలు గా సాగుతున్న ఈ వ్యవహారం పీక్స్ కి చేరుకుంటుంది. ఈ సమయంలో మైకులముందుకు వచ్చిన మంత్రి అంబటి రాంబాబు… పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అవును.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఈ సందభంగా… వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎదుర్కోవటం వైసీపీకి పెద్ద సమస్య కాదని చెప్పిన అంబటి… పవన్ పై మాత్రం ఘాటుగా స్పందించారు. పవన్ రాజకీయాలపైనా, ముద్రగడపై చేసిన వ్యాఖ్యలపైనా, వారాహి యాత్రపైనా అంబటి తీవ్రంగా స్పందించారు.

మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ దత్తపుత్రుడు పవన్ అని మొదలుపెట్టిన అంబటి… వారాహి ఎక్కి తిరిగి పిచ్చి కూతలు కూస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లు రాబోయే ఎన్నికల్లో జరగబోయేది క్లాస్ వారే అని… పవన్ కోరుకుంటున్నట్లు క్యాస్ట్ వార్ కాదని అంబటి తెలిపారు. ఇక కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు ఎలా ఓడిపోతారో రాబోయే ఎన్నికల్లో చూడొచ్చని అంబటి వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ప్రధానంగా ఏపీలో కాపు సామాజికవర్గ నేతల మధ్య జరుగుతున్న ఇష్యూపై అంబటి స్పందించారు. అప్పట్లో కాపునాడు జరిగినప్పుడు ముద్రగడ జైల్లో ఉన్నాడని, టీడీపీ వల్ల వంగవీటికి ప్రాణహాని ఉందని ముద్రగడ ఆనాడే చెప్పారని తెలిపిన అంబటి… వంగవీటి మరణానికి ముందు టీడీపీకి ముద్రగడ రాజీనామా చేశారని గుర్తు చేశారు.

ఇక కాపుల గురించి మాట్లాడే హక్కు ముద్రగడకు మాత్రమే ఉందని తెలిపిన అంబటి… హరిరామ జోగయ్యకు, పవన్ కల్యాణ్ కు అలాంటి హక్కే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు కోసం కాపులను పవన్ వాడుకోవాలని చూస్తున్నాడని అంబటి ఫైరయ్యారు.

ఇదే సమయంలో… రాజకీయాలకు పవన్ పనికిరాడన్న ఆయన పవన్ నిలబడిన చోట డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అనంతరం… చంద్రబాబుతో చేరి పవన్ కూడా 420లా తయారయ్యాడని.. పవన్ వారాహి మీద కాదు పంది మీద ఎక్కాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి.