సైనికులను చంపి దేశాన్ని భయపెట్టాలని చూశారు ఉగ్రవాదులు. కానీ వారి బెదిరింపులకు భయపడమని 40 మందిని చంపితే మరో 4 వేల మంది భరతమాత కోసం ప్రాణాలర్పించడానికి సిద్దంగా ఉన్నామని ఆ ముష్కరులకు తెలియదు. తండ్రి మరణిస్తే కొడుకు, భర్త మరణిస్తే భార్య ప్రాణాలర్పించడానికి సిద్దంగా ఉన్నారని నిరూపించారు గౌరీ ప్రసాద్.
ముంబైకి చెందిన గౌరీ భర్త ప్రసాద్ గణేష్ ఆర్మీ మేజర్ గా పని చేసేవారు. రెండేళ్ల క్రితం ప్రసాద్ భారత్, చైనా సరిహద్దులో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించాడు. భర్త మరణించాడని ఏడూస్తూ గౌరీ కూర్చోలేదు. భర్త సేవలను కొనసాగించడం కోసం ఆమె కూడా సైన్యంలో చేరాలని భావించింది. అందుకోసం అప్పటి వరకు ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసింది. ఎస్ ఎస్ బీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. రెండో ప్రయత్నంలో ఆమె టాపర్ గా నిలిచారు. త్వరలోనే చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల పాటు ట్రైనింగ్ పొంది లెఫ్టినెంట్ హోదాలో సైన్యంలో చేరనుంది.
ఈ విషయమై గౌరీ మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే…
“నేను ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలని నా భర్త ప్రసాద్ కోరిక. ఆయన చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ ఏడుస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదని అనిపించింది. నా భర్త దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి మధ్యలోనే ప్రాణాలు విడిచారు. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని భావించాను. అందుకే సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఇక మీద ఆయన యూనిఫాం నేను ధరిస్తాను. ఆ స్టార్స్ ను నేను పెట్టుకుంటాను. ఆయన విధులు నేను నిర్వహిస్తాను. ఇక నుంచి ఇది మా ఇద్దరి యూనిఫాం అవుతుంది. ఇదే నేను నా భర్తకిచ్చే గొప్ప నివాళి” అని గౌరీ ప్రసాద్ అన్నారు.