పొలిటికల్ వాతావరణం అనుకూలంగా ఉన్నా కూడా అధినేత ఎప్పుడు కూడా ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకోవాల్సింది. ఇక చంద్రబాబు ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటారు. ఇటీవల ఆయన ప్రత్యేకంగా కూటమి సహకారంతో సర్వే వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కూటమి సర్కార్పై ప్రజల్లో సహానుభూతి పెరిగిందనే సంకేతాలు అందాయట. తాజా ఇంటింటి సర్వే అందించిన వివరాల ప్రకారం, సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో చేపట్టిన ఈ విశ్లేషణలో ప్రజల అభిప్రాయాలు స్పష్టంగా బయటపడ్డాయని తెలుస్తోంది.
ప్రభుత్వ పనితీరుపై మొత్తం 80 శాతం వరకు ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టు తేలిందట. ముఖ్యంగా పింఛన్లు, ఉచిత గ్యాస్, ఇంటింటి రేషన్ వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. చదువుకున్న వారిలో 30 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నామని పేర్కొనగా, మిగతా 60 శాతం మంది స్వయం ఉపాధి, చిన్న పనుల్లో ఉన్నట్టు చెప్పారట. ఇక 10 శాతం మాత్రమే సంపూర్ణ ఉద్యోగాల్లో ఉన్నట్టు తేలింది. దీనితో, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఉపాధి క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
దీనివల్ల విద్యార్హతలున్న నిరుద్యోగులకు ప్రత్యక్షంగా అవకాశాలు కల్పించవచ్చని భావిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాల ద్వారా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ప్రజల్లో నేరుగా సమస్యలు చెప్పే అవకాశం కలగడం, వారికి ఊరట కలిగించిన అంశంగా పేర్కొనబడింది. ముఖ్యంగా భరోసా పథకాలు, హామీలు అమలవుతున్న తీరుపై ప్రజలు సానుకూలంగా స్పందించారు. ప్రజలకు అనుసంధానం పెరిగినట్టుగా నివేదిక ద్వారా అధినేతలు గ్రహించినట్లు తెలుస్తోంది.
అయితే కొన్ని మైనస్ అంశాలూ వెలుగులోకి వచ్చాయి. స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో లేరని, ఫిర్యాదులు చెప్పుకునేందుకు ఎవ్వరూ లేరు అనే అభిప్రాయం ఎక్కువగా వినిపించిందట. అలాగే ఇసుక అందుబాటుపై మరియు మద్యం సమస్యలపై అసంతృప్తి ఎక్కువగా కొన్ని జిల్లాల్లో కనిపించిందని చెప్పాలి. ఇవన్నీ కలిపి చూస్తే, మొత్తం మీద ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై 80 శాతం వరకూ సంతృప్తి ఉందని తాజా సర్వే స్పష్టం చేస్తోంది. ఇక మిగిలిన 20 శాతం సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తే, వచ్చే ఎన్నికల నాటికి మరింత బలమైన ప్రజాభిమానాన్ని సంపాదించేందుకు ఇది మంచి అవకాశం కావచ్చు.